జడ్చర్లటౌన్, డిసెంబర్ 18 : మున్సిపాలిటీలోని 12వ వార్డు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయంలో శివలింగం, నంది, గణేశ్, సుబ్రహ్మణ్యస్వామి, ధ్వజస్తంభం, దక్షిణమూర్తి, నవగ్రహాలు, నాగదేవత విగ్రహాల ప్రతిష్ఠాపన సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ప్రాతఃకాలపూజలు, జపములు, ప్రాసాదన్యాసం, ప్రాసాద అధివా సం పూజలు చేశారు. సాయంత్రం దీక్షాహోమం, ధాన్య శయ్యాధివాసం, ప్రదోషపూజ, మంగళహారతి నిర్వహించా రు. సోమవారం ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, డిసెంబర్ 18 : మండలకేంద్రంలోని సంకల్పసిద్ధి హరిహర అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం గణపతి, కుమారస్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు మూసాపేటకు చెందిన అస్కని అంజనేయులు కుమారుడు నరేందర్ రూ.1.75లక్షలతో పదునెట్టంబడికి ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు గణపతి, కుమారస్వామి విగ్రహాలను తీసుకొచ్చారు. దేవతా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠలో భాగంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అయ్యప్పస్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.