మాగనూర్, డిసెంబర్ 14: మాగనూర్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. మండల పరిధిలోని ఓబ్లాపూర్, గ్రామలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో ప్రతి బుధవారం సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. అదే గ్రామంలోని ప్రకృతివనం, నర్సరీ, క్రీడాప్రాంగణం పనులను ఆయన పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మురుగునీరు నిలిచి ఉండడం చూసి పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, మురుగునీరు నిలవకుండా చూడాలని ఎంపీవోకు సూచించారు.
అనంతరం వడ్వాట్ గ్రామంలో పర్యటించారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. జనన మరణాలపై ప్రతి గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా రికార్డులు మెయింటెనెన్స్ చేయాలన్నారు. నర్సరీ పెండింగ్ పనులు ఈ వారంలో పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. వచ్చే విడుత హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయాలని, గ్రామాల్లో పండ్లు, పూలు నీడనిచ్చే మొక్కలను పెంచాలని సూచించారు. వడ్వాట్లో రెండు రోజుల్లో పూర్తి చేయాలని కార్యదర్శిని అదేశించారు. ఓబ్లాపూర్ గ్రామంలో రికార్డులను పరిశీలించి కార్యదర్శిని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచులు నారాయణ, నర్సింహులు ఎంపీడీవో. ఎంపీవో, ఏపీవో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.