మహబూబ్నగర్, డిసెంబర్ 14 : వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రాల (సీహెచ్సీ)ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వ్యవసాయ అద్దె పనిముట్ల కేం ద్రాల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాలోని గ్రామీణాభివృద్ధిశాఖ డీపీఎంలు, ఏపీఎంలు, మేనేజర్లు, అకౌంటెంట్లకు ఒకరోజు శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రాల సామర్థ్యం పెంపుదల, పుస్తకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఇందుకోసం గ్రామ, మండలస్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ, నవాబ్పేట, సీసీకుంట, గండీడ్ కేంద్రాల పనితీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సీహెచ్సీలను దళితబంధు యూనిట్లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. ట్రాలీలు ఉన్న సీహెచ్సీలు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ప్రభుత్వ ఇసుకను తరలిచేందుకు అనుమతిస్తామన్నారు. ఉత్తమ ప్రతిభకనబర్చిన నవాబ్పేట, ఆత్మకూర్ సీహెచ్సీ సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మజ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీవోవో రజిత, సెర్ఫ్ శ్రీనివాస్, ఉమాపతి, అదనపు పీడీ శారద తదితరులు పాల్గొన్నారు.