వనపర్తి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ మార్కెట్లను ధాన్యం రాశులు ముంచెత్తుతున్నాయి. వానకాలం పంటలు చేతికొస్తున్న సమయంలో కల్లాలు, కొనుగోలు కేంద్రాలు సందడిగా మారాయి. వనపర్తి జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 50 వేల టన్నులు ఇప్పటికే కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.38 కోట్లు జమ చేశారు. ఈసారి వేరుశనగ దిగుబడి బాగా వచ్చింది. రెండ్రోజుల కిందట జిల్లా కేంద్రంలోని మార్కెట్లో క్వింటా ధర రూ.8,468 లభించింది. 2 లక్షల క్వింటాళ్ల వరకు మార్కెట్కు రావొచ్చని అధికారులు అంచనా వేశారు. పండిన పంటలకు మద్దతు ధర వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి జిల్లాలో వరి, వేరుశనగ, పత్తి పంటలు చే తికొస్తున్న నేపథ్యంలో మార్కెట్లు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. గిట్టుబాటు ధరలు లభిస్తుండడంతో రైతులు ఆనందం గా ఉన్నారు. ధాన్యం కామన్ రకం క్వింటాకు రూ.2,040 మద్ధతు ధర ఇస్తుండగా.. గ్రేడ్ ఏ రకానికి రూ. 2,060 ధర లభిస్తున్నది. అయితే, పౌరసరఫరాలశాఖ ద్వారా ఏర్పాటు చే సిన కొనుగోలు కేంద్రాలకు కేవలం కామన్ రకం వడ్లు మాత్రమే వస్తున్నాయి. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.38 కోట్లు జమచేశారు.
వేరుశనగకు రికార్డు ధర..
వరి తర్వాత జిల్లాలో వేరుశనగ పంట ఎక్కువగా సాగు చేశారు. పంట చే తికి రావడంతో రైతులు మదనాపురం, ఆత్మకూరు, వనపర్తిలోని చిట్యాల మార్కెట్ యార్డుకు రైతులు వేరుశనగ తరలిస్తున్నారు. మన వద్ద పండే వేరుశనగ నాణ్యతగా ఉండడంతో గుజరాత్, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. కొనుగోలు చేసిన వేరుశనగను చెన్నైకి రవాణా చేసి అక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచే మార్కెట్కు వేరుశనగ వస్తుండడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మార్చి వరకు కొనుగోళ్లు జరుగుతాయని మార్కెటింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. జనవరి మొదటి వారంలో మార్కెట్కు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉన్న ది. 2020-21లో 1.70 లక్షల క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.8,311 ధర పలికింది. కాగా, ఈ ఏడా ది ఆ ధరను బ్రేక్ చేసింది. రెండ్రోజుల కిం దట వనపర్తి మార్కెట్లో రూ.8,468 ధర వచ్చింది. ఈ సారి దిగుబడి ఎ క్కువగా రావడంతో రెండు లక్షల క్వింటాళ్ల వరకు మార్కెట్కు రానున్నదని అధికారుల అంచనా. ప్రారంభంలోనే అధిక ధర ఉండడంతో మరింత పెరిగే సంకేతాలు ఉన్నాయనే ఆశాభావంతో రైతులు ఉన్నారు.
ఖాతాల్లో డబ్బు జమైంది..
రెండున్నర ఎకరాల్లో వరి పండించాను. 77 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. అమ్మిన మూడు రోజుల్లోనే డబ్బులు వచ్చాయి. రూ. 1,58,208 నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే డబ్బుల కోసం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ సారు వచ్చాక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా లాభమే జరుగుతున్నది.
– జానకిరాములు, రైతు, తిరుమలాయపల్లి, మదనాపురం మండలం