నాగర్కర్నూల్/అచ్చంపేట/కల్వకుర్తి రూరల్, నవంబర్ 25 : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ప్ర భుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కార్ దవాఖానల్లోనూ వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. శుక్రవారం ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీఎంహెచ్వో సుధాకర్లాల్తో కలిసి నాగర్కర్నూల్ జిల్లా దవాఖానతోపాటు, కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ వైద్యశాలలను ఆయన తనిఖీ చేశారు. దవాఖానల్లో వసతులు, రోగులకు అందిస్తున్న సేవలను, మందుల నిల్వలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రూం, ఇతర రికార్డులను పరిశీలించి రక్తనిధి, ఆక్సీజన్ ప్లాంట్ గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న రోగులు, బాలింతలు, వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
గదులు, వార్డుల్లో పర్యటించారు. కావాల్సిన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. అధునాతన వసతుల గురించి ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి తీ సుకెళ్లి పరిష్కరించేందకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఆయనకు వైద్యులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అచ్చంపేట దవాఖాన నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. బెడ్లపై క్లాత్ లేక రోగులు సొంతంగా బెడ్షీట్లు ఏర్పాటు చేసుకోవడంతో అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఇండెంట్ ప్రకారం మందులు తీసుకెళ్లకపోవడంతో 50 రకాల మందుల గడువు ముగిసిపోవడంతో రూ.3 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు దవాఖానలను అప్గ్రేడ్ చేయడంతోపాటు డాక్టర్లు, సిబ్బందిని నియమించడం.. మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడంతో సర్కార్ వైద్యంపై భరోసా ఏర్పడిందన్నారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపా రు. పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి పేదలకు మె రుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విప్ గువ్వల మాట్లాడుతూ సాకులు చెప్పకుండా విధులు నిర్వర్తించాలని డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మార్చుకోవాలని సూచించారు. మందులు అందుబాటులో ఉంటే రోగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆయన వెంట సూపరింటెండెంట్లు ప్రభు, రఘు, డిప్యూటీ డీఎంహెచ్వో తారాసింగ్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, వైస్ చైర్మన్ శైలజా విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు మంత్రియానాయక్, చిక్కొండ శ్రీశైలం, డీసీహెచ్ఎస్ రమేశ్చంద్ర, వైద్యులు స్వర్ణలత, సందీప్, యశోదబాయి, రాజీవ్, సిబ్బంది, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, మాధవరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.