కొల్లాపూర్, నవంబర్ 22: మండలంలోని సోమశిల లలితా సోమేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం లోక కల్యాణార్థం నిర్వహించిన శ్రీ రుద్ర సహిత మహాచండీయాగంతో పుణ్యక్షేత్రం భక్తులతో పులకించింది. కలియుగంలో మానవులు పడుతున్న కష్టాలు తొలగిపోవాలని కోరుతూ చేపట్టిన యాగం విజయవంతమైంది. 130 జంటలతో 40 మంది వేదపండితులు మహాచండీయాగం దిగ్విజయంగా నిర్వహించారు. యాగానికి హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి మంగళవాయిద్యాలతో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
ప్రవచన విశారద బిరుదాంకితుడు విద్యా పీఠం వ్యవస్థాపకుడు ఇరువంటి శ్రవణ్కుమార్శర్మ, ఆలయ కమిటీ చైర్మన్తో కలిసి ఎమ్మెల్యే బీరం గణపతిపూజ, మండపపూజ నిర్వహించారు. కొల్లాపూర్ ఆర్డీవో హనుమానాయక్, ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్రెడ్డి దంపతులు యాగంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్రం, యావత్తు దేశం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వంతెన ఏర్పాటుతో సోమశిల జంక్షన్గా మారనున్నదన్నారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సోమశిలకు భారీగా భక్తులు చేరుకున్నారు.