వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ అపూర్వారావు
వనపర్తి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన వృద్ధురాలు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈనెల 7న హత్య జరుగగా పదిహేను రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈమేరకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అపూర్వారావు మంగళవారం వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం .. వనపర్తి పట్టణంలో బ్రాహ్మణ వీధిలో అమరవాది వరలక్ష్మి(68) ఒంటరిగా నివసిస్తుండేది. తరుచూ ఇంటి సమీపంలోని వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి పూజలు చేసేది. ఈక్రమంలో పోలిశెట్టి శశికళ పరిచయమై ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. శశికళ తనకు రూ.రెండు లక్షలు అవసరముందని, బాకీ ఇస్తే తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో వరలక్ష్మి తన వద్ద ఉన్న రెండు లక్షలు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ఆలస్యం జరిగి ఇద్దరి గొడవలు జరిగాయి.
మూడు నెలల కిందట రూ.రెండు లక్షలతోపాటు వడ్డీ కింద మరో 30 వేలు ఇచ్చింది. తీసుకున్న వడ్డీ ప్రకారం మొత్తం రూ.2లక్షల 70వేలు రావాల్సి ఉండగా రూ.40వేలు తక్కువ ఇచ్చావని, వాటిని కూడా చెల్లించాలని వరలక్ష్మి పట్టుబట్టింది. రూ.40వేల కోసం చాలా సార్లు శశికళను అందరిముందు అవమానించేలా మాట్లాడింది. అవమానాన్ని భరించలేక వరలక్ష్మి హత్యకు శశికళ ప్రణాళిక రచించింది. ఎలాగైనా చంపేసి తన ప్రతికారం తీర్చుకోవడంతోపాటు వరలక్ష్మి వద్ద నున్న డబ్బు, బంగారం స్వంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నది. దీనికోసం తన అక్క కుమారుడైన కర్నూల్ జిల్లాకు చెందిన తరుణ్ను సంప్రదించి తన ఆలోచన వివరించింది. ఇతనికి సహాయం చేసేందుకు వరసరకు బావమరిది అయిన కర్నూల్ జిల్లాకు చెందిన చాణక్యను సంప్రదించగా సరే అన్నాడు.
వరలక్ష్మిని చంపేందుకు మూడుసార్లు తరుణ్, చాణక్య రెక్కీ నిర్వహించారు. నవంబర్ 7న చాణక్యతోపాటు శశికళ కుమారుడు బాలకృష్ణ కలిసి ఉదయం 5 గంటలకు వరలక్ష్మి ఇంట్లో ఉన్నదని నిర్ధారించుకుని వచ్చి శశికళకు తెలియజేశారు. ప్లాన్లో భాగంగా వరలక్ష్మి, తరుణ్, చాణక్య ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి ఇంటి సమీపంలోకి వెళ్లారు. ముందుగా శశికళ వెళ్లి వరలక్ష్మితో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న తరుణ్,చాణక్య ఇద్దరు వరలక్ష్మి వద్దకు వచ్చి మీ ఇంటి పై పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసిందని, అద్దెకు కావాలని అడిగారు. వీరు ఇద్దరు వరలక్ష్మితో మాట్లాడుతుండగా శశికళ ప్లాన్లో భాగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించే వరలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సైగ చేసింది. మౌనవ్రతంలో గొడవ పెట్టదని భావించిన తరుణ్,చాణక్య ఆమె ఇంటి తలుపులు మూసి ఆమెను తరుణ్ కొడుతూనే చాణక్యతో కలిసి వరలక్ష్మి కాళ్లను అక్కడున్న టవల్తో కట్టేశారు. మరొక టవల్తో గొంతుకు ఉరి బిగించి చంపేశారు. అనంతరం వరలక్ష్మి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లో ఉన్నటువంటి నాలుగువేల రూపాయలు, ఏటీఎం కార్డు దొంగిలించుకు వెళ్లిపోయారు.
పట్టించిన ఏటీఎం కార్డు
నిందితులు హత్య చేసి దొంగిలించుకు పోయిన వరలక్ష్మి ఏటీఎం కార్డు నిందితులను పట్టించింది. వరలక్ష్మి ఏటీఎం కార్డు వెనుకాల పిన్ నంబర్ ఉండటంతో నిందితులు జడ్చర్ల బస్టాండ్ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారు. ఈ విషయాన్ని మృతురాలి బ్యాంకు స్టేట్మెంట్ ఆధారంగా సమాచారం అందుకున్న పోలీసులు డ్రా చేసిన ఏటీఎంలో సీసీ పుటేజీనీ సేకరించారు. అందులో తరుణ్, చాణక్య ఉన్న పుటేజీనీ తీసుకున్నారు. శశికళ కొడుకు బాలకృష్ణతో కలిసి వనపర్తిలోని రాజీవ్చౌరస్తాలో తిరుగుతూ సీసీ కెమెరాలకు చిక్కారు. బాలకృష్ణను పిలిచి తమ ైస్టెల్లో విచారించగా నిజం ఒప్పుకుని జరిగిన విషయమంతా చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.
ఈమేరకు చిన్ని తరుణ్కుమార్(25), నాకేళ్ల చాణక్య(34) పోలిశెట్టి శశికళ(52) , శశికళ కుమారుడు పోలిశెట్టి బాలక్రిష్ణ(26) , శశికళ సవతి కుమారుడు పోలిశెట్టి సంతోష్కుమార్(34) ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. వీరివద్ద నుంచి 1,52,300 నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక బైక్తోపాటు దొంగతనం చేసి కుదువపెట్టిన ఆభరణాలు , వాటి రశీదులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించడంలో కృషి చేసిన అదనపు ఎస్పీషాకీర్ హుస్సేన్, వనపర్తి డీఎస్పీ ఆనంద్రెడ్డి, సీఐ ప్రవీణ్కుమార్, సీసీఎస్ ఎన్స్పెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్సైలు యుగంధర్రెడ్డి, శివకుమార్, రామరాజు, సైబర్క్రైం ఎస్సై రిషికేష్ , ఇతర పోలీసులను ఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు.