జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు విద్యా కుసుమాలుగా నిలిచాయి. రుచికరమైన భోజనం.. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మెరుగైన వసతులు విద్యార్థులకు అందుతున్నాయి. అందుకే ఈ స్కూళ్లల్లో సీట్లకు భలే డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 30 పాఠశాలలు ఉండగా.. అదనంగా జిల్లాకో పాఠశాల మంజూరైంది. ఇటీవల ఈ పాఠశాలలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 35కు చేరింది. అలాగే 14 పాఠశాలలను ఐదేండ్ల కిందట జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయగా.. తాజాగా మరో 14 స్కూళ్లను అప్గ్రేడ్ చేయడంతో మొత్తం 28కి చేరాయి.
– మహబూబ్నగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనా తర్వాత చాలా మంది గురుకులాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గురుకులాల్లో సీట్లు దొరకడం లేదు. ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేక.. చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను గురుకులాల్లో జాయిన్ చేస్తున్నారు. ఫలితాలు కూడా ప్రైవేట్కు దీటుగా వస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉన్న 30 గురుకులాలకు అదనంగా మరో ఐదు పాఠశాలలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 5 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతుండగా.. ఇంటర్ స్థాయి విద్యకు ఇబ్బందవుతుందని గ్రహించిన సర్కార్.. ఉమ్మడి జిల్లాలో 14 పాఠశాలలను ఐదేండ్ల కిందట జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. ఈ ఏడాది మరో 14 పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
జిల్లాకో నూతన గురుకుల పాఠశాల..
మహత్మాజ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యాసంస్థల సొసైటీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొరగా వసతులు ఉన్న గురుకుల పాఠశాలల్లో తెలంగాణ వచ్చాక పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి సౌకర్యాలు పెంచారు. ఎనిమిదేండ్లల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గతంలో గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన పాఠశాలలు పట్టణ ప్రాంతాలకు కూడా పాకాయి. మండలాలు, గ్రామాలకు మంజూరైన పాఠశాలలను.. సరైన రవాణా సౌకర్యం, వసతులు ఉన్న నియోజకవర్గ మండల కేంద్రాల్లో నడిపిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వసతులు, మెరుగైన సౌకర్యాలు ఉన్న చోట నెలకొల్పేలా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు చాలామంది సిఫార్సు లేఖలను సైతం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు అదనంగా మరో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రారంభించేందుకు విద్యాసంస్థల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నింటిని ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లాలో 14 పాఠశాలలు కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యాయి.
పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు అదే గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసే అవకాశం లభించింది. అప్గ్రేడ్ అయిన కళాశాలలను ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో జూనియర్ గురుకుల కళాశాలల సంఖ్య 28కి చేరింది. ఉచితంగా పుస్తకాలు, రెసిడెన్షియల్ సౌకర్యం, చదువు మంచిగా ఉండడంతో విద్యార్థులు గురుకులాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
వేపూర్ గురుకులానికి స్థలం ఇచ్చిన బాలమణెమ్మ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వేపూర్ గురుకులం.. బాలికల గురుకుల కళాశాలగా అప్గ్రేడ్ అయ్యింది. అయితే, పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన బాలమణెమ్మ తన స్థలాన్ని కళాశాల కోసం విరాళంగా ఇచ్చింది. అధికారులు రెండు నెలల్లోనే కళాశాల పనులు పూర్తి చేయడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ నెల 19న ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని స్థలాన్ని ఇచ్చిన బాలమణెమ్మను మంత్రి అభినందించారు. పక్కా భవనం నిర్మించే వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఐదు గురుకులాలు..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కొత్తగా మరో ఐదు బీసీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. ఇప్పటికే 30 పాఠశాలలు ఉండగా.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన డిమాండ్, విద్యార్థుల నుంచి వస్తున్న స్పందనను గమనించిన సీఎం కేసీఆర్ జిల్లాకో గురుకులాన్ని కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు ఐదు బీసీ గురుకులాలు మంజూరయ్యాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రారంభించాం.
– వెంకట్రెడ్డి, ఉమ్మడి జిల్లాల కో ఆర్డినేటర్, జడ్చర్ల