వనపర్తి జిల్లాను లక్ష్మీ కరుణించింది.253 గ్రామ పంచాయతీలకు, 5 మున్సిపాలిటీలకు రూ.53.80 కోట్లకుగానూ రూ.26.80 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభం కాగా.. ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి, నవంబర్ 11 : 2022 మార్చి 8.. వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం, పార్టీ కార్యాలయ భవనం, ‘మన ఊరు-మన బడి’, నూతన మార్కెట్ యార్డులను ప్రారంభించడంతోపాటు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి తమ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఆ సమయంలో ప్రత్యేక నిధులను మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా ముఖ్య ప్రణాళిక కార్యాలయం నుంచి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించి రూ.53.80 కోట్లకు ప్రతిపాదనలు పంపగా.. రూ.26.90 కోట్లు మంజూరయ్యాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని జిల్లాలోని గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో రేవల్లి మండలం బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామ పంచాయతీలకు మినహా మిగిలిన 253 జీపీలు, ఐదు మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. వనపర్తి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 128 జీపీలకు రూ.10 లక్షలు, మిగిలిన 125 జీపీలకు రూ.20 లక్షల చొప్పున.., వనపర్తి మున్సిపాలిటీకి రూ.కోటి, ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట బల్దియాలకు రూ.50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్లను ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీలకు అందజేయగా.. పనులను ప్రారంభిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా విడుదల చేసిన నిధులతో.. అటు గ్రామ పంచాయతీలు, ఇటు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. కొన్ని చోట్ల పనులకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసుకోగా.. మరికొన్ని చోట్ల పనులకు శంకుస్థాపన, భూమి పూజలు చేస్తున్నారు. ప్రధానంగా సీసీ రోడ్డు, డ్రైనేజీలు, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, కల్వర్టు వంటి పనులకు అధికంగా నిధులు వచ్చాయి.
మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్..
జిల్లాకేంద్రంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనకు వచ్చిన సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.26.90 కోట్లు మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చిన నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మార్చేందుకు మంత్రి నిరంజన్రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ దిశగా పనులు చేపడుతాం. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– గట్టు యాదవ్, మున్సిపల్ చైర్మన్, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
మరింత అభివృద్ధి సాధ్యం..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.53.80 కోట్ల పనులకుగానూ ప్రణాళికలు పంపాం. అందులో రూ.26.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యేలోగా.. మిగిలిన డబ్బులు కూడా వస్తాయి. ప్రస్తుత నిధులతో గ్రామాలు, పట్టణాల్లో మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది.
– వెంకటరమణ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, వనపర్తి