వనపర్తి టౌన్, అక్టోబర్ 31: లోకంలోకి రాకముందే లోకం నుంచి దూరమై గంగమ్మ ఒడిలోకి చేరింది. తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వాల్సింది పోయి కన్న ప్రేగుబంధాన్ని తెంచుకొని నల్ల చెరువులో వదిలివేసిన హృదయ విదారక ఘటన సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువులో నీటి అలలకు ఓ పసికందు ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
ఆడ పిల్ల అనో అధిక సంతానమనో, ప్రసవ సమయంలో తల్లిగర్భంలో మరణించిందో తెలియదు కానీ అమ్మ పేగు బంధాన్ని తెంచుకొని లోకంలో అడుగు పెట్టకముందే శవమై కనిపించింది. జిల్లా కేంద్రంలో నల్ల చెరువు కట్టపై వాకర్స్, చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన కొందరు చిన్నారి శవాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై యుగంధర్రెడ్డి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీసి ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.