ప్రభుత్వ కళాశాల అంటేనే నెర్రెలు బారిన గోడలు.. బూజుపట్టిన తరగతి గదులు.. పరీక్షలకు మాత్రమే దర్శనమిచ్చే ల్యాబ్లు అనుకుంటే పొరపాటు. జస్ట్ ఫర్ ఏ చేంజ్.. కళాశాలలో బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్, పీహెచ్డీ విద్యార్థులకూ ల్యాబ్ సౌకర్యం, 527 రకాల మొక్కలతో బొటానికల్ గార్డెన్ ఇలా వింటుంటేనే వింతగా,కొత్తగా,ఆశ్చర్యంగా ఉంటుంది..కానీ ఇది నిజం. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ల్యాబ్ రూపుదిద్దుకుంటున్నది.. అతి త్వరలో ప్రారంభానికి సిద్ధం కానున్నది. ఈ అద్భుత ఆవిష్కరణకు కళాశాల జీవశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సదాశివయ్య జీవం పోయడంతో డిగ్రీ కళాశాల స్థాయిలో దేశంలోనే మొదటి ల్యాబ్గా నిలువనుండడం విశేషం.
– జడ్చర్ల, అక్టోబర్ 11
జడ్చర్ల, అక్టోబర్ 11 : విద్యార్థులు జీవవైవిధ్యంపై అధ్యయనం చేసేందుకుగానూ జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా అధునాతన బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాయిలో దేశంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ ల్యాబ్ జడ్చర్లలో ఏర్పాటవుతున్నది. బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసి అందులో 527 రకాలకు చెందిన ఆరువేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
తెలంగాణలో లభ్యమయ్యే అరుదైన మొక్కలను రాష్ట్ర ఔట్లెట్ ఆకారంలో ఆయా జిల్లాల వారీగా నాటి సంరక్షిస్తున్నారు. ఈ గార్డెన్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతోపాటు సీఎం కేసీఆర్ ప్రశంసించి గార్డెన్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిధులతోపాటు పూర్వవిద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేస్తున్న బయోడైవర్సిటీ ల్యాబ్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
మరో పది రోజుల్లో ల్యాబ్ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధానంగా పదో తరగతి నుంచి పీహెచ్డీ విద్యార్థులు ల్యాబ్ను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రంలోని వృక్షాలు, పక్షులు, జంతువులు, సీతాకోకచిలుకలు తదితర జీవవైవిధ్యంపై ల్యాబ్లో అధ్యయనం చేసేందుకు వీలుకలుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి ల్యాబ్లు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. దీంతో గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటున్నది. అంతేకాకుండా హైదరాబాద్లో పరిశోధన చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇందుకు డబ్బు, సమయం వృథా అవుతున్నది. ఈ క్రమంలో జడ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్లో విద్యార్థులు ఉచితంగా రీసెర్చ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఇప్పటికే నల్లమల అడవిలో ఉండే మొక్కలు, బట్టర్ఫ్లైస్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే అర్బన్ ఫారెస్ట్ మొక్కలపై అధ్యయనం చేస్తున్న ఏడుగురు పీహెచ్డీ విద్యార్థులు జడ్చర్ల ల్యాబ్లో పరిశోధన చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న రీసెర్చ్ ల్యాబ్లో గ్రామీణ విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నారు. పీజీ, పీహెచ్డీలో ఉండే ల్యాబ్ను డిగ్రీస్థాయి నుంచే ఏర్పాటు చేయడం బీఆర్ఆర్ కళాశాలకే దక్కింది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే హెర్బీరియా కేంద్రం జడ్చర్లలో ఉన్నది.
ఇందులో 2,250 మొక్కల నమూనాలను సేకరించి ఉంచారు. ఇది కూడా రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ల్యాబ్లు ఎక్కడా లేకపోవడం వల్ల అందరూ జడ్చర్లకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే, 1979లో జడ్చర్లలో అధ్యాపకుడిగా పనిచేసిన ఎస్.టి.రామారావు ఈ కళాశాలలోనే ఒక కొత్తమొక్కను కనుగొన్నారు. అప్పటి నుంచే జడ్చర్ల కళాశాలలో రీసెర్చ్ చేయడం జరుగుతున్నది. నాలుగేండ్లుగా కళాశాలలో పనిచేసే జీవశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సహకారంతో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. 39 రకాల పాములపై కూడా సదాశివయ్య పరిశోధనలు చేశారు. జడ్చర్ల బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్లో మైక్రోస్కోప్లతోపాటు కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మైక్రోస్కోప్లో చూసిన దానిని కంప్యూటర్లో ఇంకా పెద్దదిగా చూసే అవకాశం ఉండడంతో విద్యార్థులకు సులువుగా గుర్తించే వీలుంటుంది.
దేశంలో మొట్టమొదటి ల్యాబ్..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాయిలో జీవవైవిధ్యంపై అధ్యయం చేసేందుకు దేశంలో ఎక్కడా బయోడైవర్సిటీ రీసెర్చ్ ల్యాబ్లు లేవు. పీజీ, పీహెచ్డీ కళాశాలలో మాత్రమే ఇలాంటి ల్యాబ్లు ఉంటాయి. దేశంలో మొట్టమొదటి సారిగా డిగ్రీ కళాశాల స్థాయిలో జడ్చర్లలో అధునాతన బయోడైవర్సిటీ ల్యాబ్ ఏర్పాటవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశోధనలు చేసే విద్యార్థులు ఎక్కడికో వెళ్లి రీసెర్చ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం జడ్చర్లలో ల్యాబ్ ఏర్పాటు చేయడంతో వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఎలాంటి ఖర్చులేకుండానే పరిశోధనలు చేసుకోవచ్చు. పక్షులు, సీతాకోకచిలుకలు, జంతువులు, మొక్కలపై పరిశోధనలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– డాక్టర్ సదాశివయ్య, జీవశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల