మహబూబ్నగర్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా సాగింది. చివరకు పంచాయితీ పోలీస్స్టేషన్కు చేరింది. మల్లు భట్టివిక్రమార్క ఫోన్లో బతిమిలాడారు. రాహుల్గాంధీ జోడో యాత్ర వస్తున్న సమయంలో లొల్లి ఏంటని జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్లో పంచాయితీ పెడుదామన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ నేతల సమావేశానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు హాజరయ్యారు. సమావేశానికి మహిళలు తక్కువగా హాజరుకావడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో అసలు మహిళా కాంగ్రెస్ ఉందా? అని ప్రశ్నించారు. పనిచేయకపోతే రాజీనామా చేయండి అనడంతో పంచాయితీ షురూ అయింది. ‘రాజీనామా అడిగే హక్కు నీకెక్కడది..? పార్టీ కోసం పనిచేస్తున్న నన్ను అందరిముందు అవమానిస్తావా..’? అంటూ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత బోరున ఏడ్చారు. దీంతో పీసీసీ సభ్యుడు వినోద్, ఇతర కాంగ్రెస్ నేతలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై విరుచుకుపడ్డారు.
ఆమె తీవ్ర స్వరంతో మీరెవరు.. మీకేం పని.. మహిళా కాంగ్రెస్ సమావేశానికి మగవారు ఎందుకు వచ్చారు.. అంటూ మండిపడ్డారు. దీంతో మాటామాట పెరిగింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా డీసీసీ అధ్యక్షుడు ఓబెదుల్లా కొత్వాల్ ప్రేక్షకపాత్ర వహించారు. ఇదేం పద్ధతి.. ఇది సమావేశమేనా.. పనిచేయని వాళ్లు మహిళా కాంగ్రెస్కు అవసరం లేదని.. రాజీనామా చేయమని రాష్ట్ర అధ్యక్షురాలు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. జిల్లా నేతలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడికి దిగినంత పనిచేశారు. అసలు ఎవరు రమ్మన్నారు అనేంతవరకు పరిస్థితి వెళ్లింది. వాగ్వాదం, అరుపులతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత కన్నీటి పర్యంతమయ్యారు.
రాజీనామా అడగడానికి నీవెవరు అంటూ రాష్ట్ర అధ్యక్షురాలిని నిలదీశారు. దీంతో సమావేశంలో పిలవని నేతలు వచ్చి కూర్చొని దూషించడంతో తనను అవమానించిన నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షురాలు మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫి ర్యాదు చేశారు. టూటౌన్ పోలీస్స్టేషన్ ఆవరణ అంతా కాంగ్రెస్ నాయకులు, మీడియాతో నిండిపోయింది. ఏం జరుగుతుందోనని కొద్దిసేపు ఉత్కంఠ వాతా వరణం నెలకొన్నది. తనను అవమానించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్టేషన్లో భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్ నేతలు కేసు పెడితే తమ పరువు పోతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు చెప్పడంతో ఫోన్లో పరిస్థితిని చక్కదిద్దారు. గాంధీభవన్కు రావాలని బతిమాలడంతో సీన్ అక్కడికి మారింది. రాహుల్గాంధీ జోడో యాత్ర మరికొన్ని రోజుల్లో జిల్లాలో ఎంటర్ అవుతున్న వేళ మహిళా కాంగ్రెస్ నేతలు జుట్లు పట్టుకున్నంత పనిచేయడం చర్చనీయాంశంగా మారింది.