నాగర్కర్నూల్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): మునుగోడు గడ్డ మీద గులాబీ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీశ్రేణులు రంగంలోకిదిగారు. ఇప్పటికే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందగా.. ఉప పోరులో విజయం సాధించడంలో మన నేతలు భాగం కానున్నారు. వచ్చే నెల 3న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచార రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డితోపాటు పలువురు ఇప్పటికే తమకు కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. నాయకుల సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తూ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీ ప్రలోభాలకు గురై రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 7న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 14వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబర్ 3న ఎన్నికలు ఉంటాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్రెడ్డితో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రచారం ప్రారంభించనున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార పర్వం ముగిసే వరకూ ఆయా గ్రామాల్లో ప్రచారానికి ఇన్చార్జీలుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, రాజగోపాల్రెడ్డి, బీజేపీల వైఖరిపై మునుగోడు ప్రజలకు ఇప్పటికే తేటతెల్లమైంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం బాధ్యతలు కేటాయించారు.
దీంతో ప్రచార పర్వమంతా మంత్రులు, ఎమ్మెల్యేలే నిర్వహించనున్నారు. నాయకులందరూ ఇప్పటికే రెండు,మూడుసార్లు గెలిచిన అనుభవంతో వ్యూహాలు పన్నడంలో ధీటుగా మారారు. ఈ అనుభవాన్ని మునుగోడు ప్రచారంలో చూపించనున్నారు. ముందుగా స్థానిక నాయకులతో మమేకం కానున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, బూర నర్సయ్యగౌడ్లూ మద్దతు ఇవ్వనున్నారు. దీంతో మునుగోడులో కూసుకుంట్ల గెలుపు నల్లేరుపై నడకేననే అభిప్రాయం నెలకొన్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుపు ఆవశ్యకతను స్థానిక నాయకులు, ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా పార్టీ ఎదిగేందుగు దోహదపడుతుందనే అంశాన్ని పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. ఆయా గ్రామాల్లో సమస్యలను గుర్తించడం, పరిష్కారానికి తామే అప్పటికప్పుడే చర్యలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్లాంటి పథకాల అమలు ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా తీర్చిన వైనాన్ని జనంలోకి తీసుకెళ్లనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండీ ఏమీ చేయలేని బీజేపీ కుట్రలను నాయకులు ఎండగట్టనున్నారు. మొత్తం మీద తమకు కేటాయించిన గ్రామాల్లో 90శాతం ఓటింగ్ను టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు వచ్చేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారపర్వం సాగించనున్నారు.
భారీ మెజార్టీ లక్ష్యంగా ప్రచారం
మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్లు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలే పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందాయి. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దే. పార్టీ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తాం. ప్రతి ఓటరును కలిసి ఈ ఎన్నికల్లో బీ(టీ)ఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత వివరిస్తాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన బాధ్యతను వంద శాతం నెరవేరుస్తాం
– మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే