మదనాపురం, అక్టోబర్ 9 : మండల కేంద్రానికి సమీపంలోని రైల్వేగేటు వద్ద మారెడ్డిపల్లి వాగులో శనివారం గల్లంతై మృతిచెందిన వారి కుటుంబాలను అండగా ఉంటూ ఆదుకుంటామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భరోసానిచ్చారు. ఆదివారం ఆయన నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాగులో ముగ్గురు గల్లంతైన విషయాన్ని మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారని తెలిపారు. గాలింపు చేపట్టగా సంతోషి, పరిమళ మృతదేహాలు లభ్యంకాగా సాయికుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసినా ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. అంత్యక్రియల నిమిత్తం కింద రూ.30 వేలు బాధిత కుటుంబ సభ్యులకు అందించినట్లు పేర్కొన్నారు. వీరు దళితులు కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గతనెల 8న మృతి చెందిన ఆత్మకూరుకు చెందిన ఆకుల కురుమూర్తితోపాటు సంతోషి, పరిమళ, సాయికుమార్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షలు సొంతంగా అందిస్తానన్నారు. సంతోషి కుమారుడికి అవుట్ సోర్సింగ్ కోటాలో ఉద్యోగం, ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేలా చూస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవుపలికారు. శోక సముద్రంలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిందిపోయి వారిని మరింత బాధ పెట్టేలా ప్రవర్తించడం సరికాదన్నారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే 50 ఏండ్లు పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు మారెడ్డిపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం కాదు… మీకు దమ్ముంటే అరుణమ్మ-భరత్సింహారెడ్డి ఇంటిముందు ఆందోళన చేయాలని సూచించారు. వేముల-దేవరకద్ర వరకు సంబంధించిన కాంట్రాక్టర్ ఐదేండ్లుగా పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్త టెండర్లు పిలిచి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం సంతోషి, పరిమళ మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, తాసిల్దార్ నరేందర్, రెవెన్యూ సిబ్బంది, ఆత్మకూరు సీఐ రత్నం, ఎస్సైలు మంజునాథరెడ్డి, నాగశేఖర్రెడ్డి, పోలీసులు జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మార్కెట్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.