తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తం చేసేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం మహబూబ్నగర్ మండలంలో పర్యటించారు. లబ్ధిదారులకు నూత ఆసరా పింఛన్కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తమైతే ప్రపంచంలోనే దేశం నెంబర్వన్ అవుతుందన్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండలం కోడూరు, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, మాచన్పల్లి, రాంచంద్రాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్కార్డులు పంపిణీ చేశారు. మీ దీవెనలతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. దేశంలో తెలంగాణను నెంబర్వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అనేక రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేండ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. పింఛన్లు తీసుకుంటున్నోళ్లు కేసీఆర్ను మరిచిపోరన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తమైతే ప్రపంచంలోనే దేశం నెంబర్వన్ అవుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ రైతులకు ఇస్తుంటే ఓర్వలేని కేంద్రం బాయికాడ మోటర్లకు మీటర్లు బిగించమని వత్తిడి తెస్తుందని విమర్శించారు. తెలంగాణ రాకముందు సాగు, తాగునీరు అందకతీవ్ర కష్టాలు పడేటోళ్లు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేయడానికి ముందుంటానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని కొందరు కుల, మతాల పేరుతో చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ అమలవుతున్న పథకాలన్నీ తమ రాష్ర్టాల్లో అమలు చేయాలనే డిమాండ్ ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న ఆదరణ కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ పాల్గొన్నారు.
మంత్రి సుడిగాలి పర్యటన
పాలమూరు, అక్టోబర్ 3: సర్కార్ ఉచిత చేప పిల్లల పంపిణీతో తెలంగాణలో మత్స్య సంపద భారీగా పెరిగిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు మైసమ్మ చెరువులో 42వేల ఉచిత చేప పిల్లలను వదిలారు. జిల్లాలోని 1086 చెరువుల్లో 190.16లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. కోడూరు, అప్పాయిపల్లి, ఓబులాయపల్లి తండా, కోటకదిర, పోతన్పల్లి, మాచన్పల్లి, రామచంద్రాపురంలో మహిళలుకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, మత్య్స పారిశ్రామిక సహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, జిల్లా మత్య్సశాఖ అధికారి డి.రాధారోహిణి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, ముడా డైరెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.