మహబూబ్నగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. కాలనీలు చెరువులను తలపించాయి. పలుచోట్ల పిడుగుపాటుకు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అక్కడక్కడా ఇండ్లు నేలమట్టమయ్యాయి. తెలకపల్లి మండలం తాళ్లపల్లి వాగులో యువకుడు గల్లంతయ్యాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులను అందజేశారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పాలమూరు అతలాకుతలం అవుతున్నది. గురువారం 10సెంటీమీటర్ల వర్షం కురువగా శుక్రవారం ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో వరదనీరు తొలగించేందుకు ఆలస్యమవుతున్నది. మున్సిపల్ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నా వర్షం పడుతుండటంతో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచనల మేరకు అధికారులు ఆల్మాస్ ఫంక్షన్హాల్, బీకేరెడ్డికాలనీలోని ఓ కళాశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు.
అక్కడే భోజన వసతి కల్పించారు. ఇండ్ల నుంచి బయటకురాని వారికి మున్సిపల్ సిబ్బంది ఆహారం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, మున్సిపల్చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్, తాసిల్దార్ పార్థసారథి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. రామయ్యబౌళి, బీకేరెడ్డికాలనీ, కురుహిణిశెట్టికాలనీ, మేనక థియేటర్ వద్ద రహదారులపై వరదనీరు పారుతున్నది. ఇండ్లలోకి నీళ్లు వెళ్లకుండా రహదారుల పైనుంచి మళ్లిస్తున్నారు. న్యూటౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల్లోకి వరదనీరు రావడంతో మున్సిపల్ సిబ్బంది మోటర్ల సహాయంతో నీళ్లను బయటకు తోడుతున్నారు.
‘సంగంబండ’ రెండు గేట్లు ఎత్తివేత
మక్తల్టౌన్, సెప్టెంబర్ 30: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్(సంగంబండ) రిజర్వాయర్కు వరద పోటెత్తుతున్నది. శుక్రవారం రెండు గేట్లను ఎత్తి దిగువకు వరదనీటిని విడుదల చేశారు. రిజర్వాయర్కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నట్లు రిజర్వాయర్ డీఈ సురేశ్ తెలిపారు. రెండు వేల క్యూసెక్కుల వరద రావడంతో రెండు గేట్ల ద్వారా 3400క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 364మీటర్లకుగానూ, 362.5మీటర్ల వరకు నీరు నిల్వ ఉన్నదన్నారు. ప్రస్తుతం 2.3టీఎంసీల నీరు రిజర్వాయర్లో నిల్వ ఉందన్నారు.
తాళ్లపల్లి వాగులో యువకుడు గల్లంతు
మండలంలోని తాళ్లపల్లి వాగులో రాఘవేందర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. సాయంత్రం వరకు రెస్క్యూ టీం వెతికినా ఆచూకీ దొరకలేదు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రాఘవేందర్ శుక్రవారం ఉదయం తన వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతయ్యాడు. యువకుడికి గతేడాది వివాహమైనదని గ్రామస్తులు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గాలింపు చర్యలు కొనసాగించాలని అగ్నిమాపకశాఖ, పోలీస్ అధికారులను ఆదేశించారు. చైర్పర్సన్ వెంట ఎంపీపీ మధు, ఆర్డీవో నాగలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
శాశ్వత పరిష్కారం చూపుతాం
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని, వరదనీరు నిలబడకుండా అండర్ డ్రైనే జీలు నిర్మించి శాశ్వర పరిష్కారం చూపుతామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహం ఎక్కువైందన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్నా అర్ధాంతరంగా రద్దు చేసుకొని కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యల ను తెలుసుకుంటున్నామని అన్నారు.
అలాగే వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి భోజనం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి బాధితులకు భరోసా ఇచ్చారు. వరద తగ్గేవరకు ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు చెరువులు ఎండిపోయి ఉండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చదనానికి ప్రాధాన్య త ఇవ్వడం వల్ల పుష్కలంగా వానలు కురుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల నాలాలు కబ్జాకు గురయ్యాయని, మురుగు వెళ్లేందుకు మార్గం లేదన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదకు చెక్పెడుతామన్నారు. ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.