గద్వాలటౌన్, సెప్టెంబర్ 26: అఖిలాండకోటి బ్రహ్మండనాయకి… ఆదిపరాశక్తి.. త్రైలోక్య సంచారణి.. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత.. అంటూ ఎన్నెన్నో పేర్లతో భక్తులు వేనోళ్ల స్తుతించే దుర్గమ్మ శరన్నవరాత్రులు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులను పురస్కరించుకొని గద్వాల కొత్త శోభను సంతరించుకున్నది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయాలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోతున్నాయి. మొదటిరోజు అమ్మవారు రాజరాజేశ్వరి, బాలమ్మదేవి, శాకాంబరి, శైలపుత్రి, దుర్గామాత, లలితాదేవి, మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల కోటలోని భూక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో స్వామికి విశిష్ట పూజలను చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రాత్రి స్వామివారిని పూలపల్లకీపై ఊరేగించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి, అన్నపూర్ణేశ్వరీదేవి, మార్కండేయస్వామి, అంబాభవానీ, తాయమ్మ, కాళమ్మ, పిలిగుండ్లలోని ముడుపుల ఆంజనేయస్వామి ఆలయాల్లో వివిధ రూపాల్లో అమ్మావారు భక్తులకు దర్శనమిచ్చారు.
గంటవీధి, అశోక్నగర్, కుమ్మరి వీధి, అట్కార్పేట, వేదనగర్, సాయి మందిరం, రాఘవేంద్రస్వామి ఆలయంతోపాటు పలు కాలనీల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అయా మండపాల్లో ఉదయం 6గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం, గణపతిపూజ, పంచామృతాభిషేకాలు, గోపూజతోపాటు వివిధ జలాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. సాయంత్రం కుంకుమార్చనలు చేశారు.
మల్దకల్, సెప్టెంబర్ 26: మండల కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో బాలత్రిపుర సుందరిదేవీగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చణ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకుడు రవి ఆచారి భక్తుల తరఫున అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, వాసవీ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
అయిజ, సెప్టెంబర్ 26: పట్టణంలోని అంబాభవానీ, వాసవీ కన్యకాపరమేశ్వరి, కాళికాదేవి ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రులకు అంకురార్పణ చేశారు. కొరువుదీరిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అంబాభవానీ మహాగౌరి, వాసవి కన్యకాపరమేశ్వరి బాలత్రిపురసుందరీదేవి, కాళికాదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రులను పురస్కరించుకొని కాళికాదేవిని పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు.
మానవపాడు, సెప్టెంబర్ 26: మండలకేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారు మహాగౌరిదేవిగా దర్శనమిచ్చారు.
ఇటిక్యాల, సెప్టెంబర్ 26: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయ ప్రాంగణంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో సోమవారం అమ్మవారు ఆదిలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుడు భవనచంద్ర అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాదాల నివేదన, మహామంగళహారతి నిర్వహించారు. అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో కొలువుదీరిన అమ్మవారు మొదటిరోజు బాలత్రిపురసుందరీదేవిగా భక్తులచే పూజలందుకొన్నారు. రామాలయంలో మేనేజర్ సురేందరాజు, ఆంజనేయస్వామి ఆలయంలో ఈవో రామన్గౌడ్ పర్యవేక్షించారు.
వడ్డేపల్లి, సెప్టెంబర్ 26: శాంతినగర్లోని సీతారామాలయ ఆవరణలో నిర్వాహకులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం అమ్మవారిని బాలత్రిపురసుందరీదేవిగా అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, ప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.