ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుతూనే వైద్యరంగాన్ని ఎంతో మెరుగుపర్చింది. గతంతో పోలిస్తే సర్కార్ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. అయితే సేవ పేరిట ప్రైవేట్ వైద్యశాలలను ఏర్పాటు చేసిన కొందరి అత్యాశ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో డీఎంహెచ్వోల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరగనున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలను పరిశీలించనున్నది. పాటించని దవాఖానలు, వైద్యులు, ల్యాబ్లపై చర్యలు తీసుకోనున్నది.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం సేవలు అందిస్తుంటే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డాయి. ఇది ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారిన నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేటతో పాటుగా మున్సిపల్ కేంద్రాల్లో మల్టీ స్పెషాలిటీ, గుండె, డెంటల్, స్కిన్ కేర్, ఐ కేర్ పేరిట పుట్టగొడుగుల్లా దవాఖానలు, ఫిజియోథెరపీ కేంద్రాలు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్లు ఏర్పాటవుతూనే ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా, మున్సిపల్ కేంద్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. కొంత ఆర్థికంగా ఉన్న మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో అత్యవసర సమయాల్లో ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో అధికంగా గర్భిణులే ఉంటున్నారు.
కాగా చికిత్స కోసం వెళ్తే సరైన వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. కొన్ని చోట్ల ఆపరేషన్లు చేస్తామంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతో బాధితులు తప్పనిసరై రాజీ కుదుర్చుకొంటున్నారు. దీనికి ప్రధాన కారణం…ప్రైవేట్ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, క్వాలిఫైడ్ వైద్యులు లేకపోవడమే. చాలావరకు ఎంబీబీఎస్ చదివిన వైద్యులే సిజేరియన్లు చేస్తున్నారు. కడుపులో గడ్డలను తొలగిస్తున్నారు.
సిజేరియన్లు చేసి రూ.40వేలకుపైగా దోచుకొంటున్నారు. కొందరు సర్కార్ వైద్యులు, సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రులకు ఏజెంట్లుగా మారారు. రోగులకు ఆయా ఆస్పత్రులకు పంపిస్తూ కమీషన్ పొందుతున్నారు. ఇదంతా బహిరంగ రహస్యంగా మారింది. ఇక డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ల్యాబ్లు సైతం ఏర్పాటు చేసుకొంటున్నారు. కొందరు ల్యాబ్, మెడికల్ షాపుల నిర్వాహకులే ఆస్పత్రులను ఏర్పాటు చేసి వైద్యులను నియమిస్తూ జీతాలు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇతరుల పేరిట ఉన్న సర్టిఫికెట్లతో ఈ ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లను నెలకొల్పుతున్నారు. అదే విధంగా హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులంటూ స్థానిక ఆస్పత్రులల్లో ఆదివారాలు, శనివారాల్లో ప్రత్యేక క్లీనిక్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో రోగికి రూ.500నుంచి రూ.1000వరకు ఫీజును వసూలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశంతో వైద్యారోగ్య శాఖ తనిఖీలకు నిర్ణయించింది. డీఎంహెచ్వోల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో బృందాలు తనిఖీలు చేయనున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని నిబంధనలను పాటించని ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు. పది రోజుల్లో ఈ బృందాలు తనిఖీలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యుల వివరాలనూ ఈ సందర్భంగా గుర్తించి ప్రభుత్వానికి పంపనున్నారు. గతంలో మంత్రి హరీశ్రావు జిల్లాకు వచ్చిన సందర్భంగా ఇదే అంశంపై మందలించిన సంఘటన జరిగింది. నాగర్కర్నూల్లో మెడికల్ కళాశాల రావడం, జిల్లా దవాఖాన జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ కావడంతో దాని పరిసరాల్లో కొత్తగా హాస్పిటళ్లు, ల్యాబులు ఏర్పాటయ్యాయి. అధికారికంగా ఉన్న లెక్కలకు మించి ఆస్పత్రులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా వైద్యఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్లో 72ఆస్పత్రులు, 37ల్యాబ్లకు అనుమతులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన 16 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర వైద్యశాఖ ఆదేశంతో జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలకు బృందాలు ఏర్పాటు చేశాం. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని దవాఖానలను తనిఖీలు చేసి సదుపాయాలు, వైద్యులు, ల్యాబ్లు, ఆస్పత్రుల అర్హతలు, నిర్వహణపై వైద్యశాఖకు నివేదిక అందజేస్తాం.
– సుధాకర్లాల్, డీఎంహెచ్వో,నాగర్కర్నూల్