వనపర్తి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్యను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అటవీ సంరక్షణ, పునరుజ్జీవానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పోడు భూములపై సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చాలా కాలంగా పోడు భూములను సాగు చేస్తూ.. అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. జిల్లాలో 28,343.44 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం ఉన్నదన్నారు. జిల్లాలో 6 మండలాల్లో 35 గ్రామ పంచాయతీల్లో 54 ఆవాస ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.
ఇప్పటివరకు 6074.38 ఎకరాలకు సంబంధించి 3,214 క్లెయిమ్లు స్వీకరించినట్లు సూచించారు. రెవెన్యూ పంచాయతీరాజ్, అటవీశాఖలు సమన్వయంతో ఎంపీడీవోలు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. 2005 ఏడాదికి ముందు నుంచి అన్యాక్రాంతమైన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా 75 ఏండ్ల నుంచి పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనేతరులకు సంబంధించిన క్లెయిమ్లను గ్రామస్థాయి కమిటీలో క్లయిమ్దారు సమక్షంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఆయా స్థాయి కమిటీల తీర్మానాలు, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలని సూచించారు.
అటవీ భూముల్లో పోడు వ్యవసాయం ఎప్పటి నుంచి జరుగుతున్నదన్న వివరాలను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు శాటిలైట్ మ్యాపుల ప్రకారం సాంకేతికతతో జీపీఎస్ సిస్టం ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి పక్కాగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. భూమినే జీవనాధారంగా బతుకుతున్న వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తద్వారా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అంతుతాయని చెప్పారు.
మండల పరిషత్ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ధేశించిన విధానం ప్రకారం డిజిటల్ సర్వే చేసి గ్రామాల నుంచి తీర్మానాలు పంపాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందిస్తామని తెలిపారు. అనంతరం అటవీ భూములకు ఆక్రమణలు జరుగకుండా వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు పోడు భూములను సర్వే చేసి గిరిజన, గిరిజనేతరులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ వాణీదేవి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ ఆశిష్ సెంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఫారెస్టు అధికారి రామకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 22: నిండు మనసుతో పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలోని 9వ వార్డు మర్రికుంటలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 50లక్షల మందికి ఆసరా అందిస్తున్నామన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లాంటి పథకాలతోపాటు గురుకులాలతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు.
ప్రేమకు నిండు మనసుతో ఇచ్చే కానుకకు కొలమానం ఉండదని భిన్న మతాల ప్రజల పండుగలైన దసరా, రంజాన్, క్రిస్మస్ వేడుకల్లో పేద ఆడపడుచులకు చిరు కానుకను అందజేస్తున్నామన్నారు. వనపర్తిలోని జంగాలగుట్ట, లక్ష్మీనరసింహకాలనీ, భగీరథ కాలనీ, పీకే తండాలో రోడ్లు, తాగునీటి వసతి కల్పించాలని వార్డు కౌన్సిలర్ బాషానాయక్ ఆధ్వర్యంలో కాలనీవాసులు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. వారంరోజుల్లో వార్డు పరిశీలన చేసి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు కళాకారులు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు బాషానాయక్, బండారు కృష్ణ, పాకనాటి కృష్ణ, నాగన్నయాదవ్, నారాయణ, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసులు, తేజ ఉన్నారు.