అయిజ, సెప్టెంబర్ 19: జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిపంటలు వైరస్ బారిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు యాజమాన్య పద్ధతులు తప్పని సరిగా పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం పత్తిపంట 80-90 రోజుల దశలో ఉండగా, తలమాడు తెగులు (టొబాకోస్ట్రీక్ వైరస్) పత్తిపంటను ఆశిస్తున్నట్లు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు గుర్తించారు.
తలమాడు తెగులు సోకిన మొక్క కొమ్మల చివరి లేత ఆకులు పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయని సూచిస్తున్నారు. వైరస్ సోకిన కొమ్మల్లో ఎదుగుదల ఆగిపోయి గిరసబారుతాయని పేర్కొన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ వ్యాపించిన కొమ్మలకు ఉన్న మొగ్గలు ఎండి రాలిపోతాయని చెప్పారు. తలమారి తెగులు వయ్యారిభామ (కలుపు మొక్కలు) పుప్పొడి రేణువుల నుంచి పత్తిమొక్కలకు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అలాగే పచ్చదోమ, పేనుబంక తెగుళ్లు సైతం సోకుతున్నాయని రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించి పత్తిపంట సాగు పెంచుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
పత్తిపంట సాగు చేసిన పొలంలోని గట్ల వెంబడి ఉండే వయ్యారిభామ ఉత్తరేణి, గడ్డి చామంతి వంటి కలుపు మొక్కలను పూతకు రాకముందే తొలగించి తగలబెట్టడం వైరస్ రోగనివారణకు ఏకైక మార్గం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త తిరుమలరావు సూచనలు పాటించి పత్తిపంటకు వస్తున్న తెగుళ్లను నివారించుకోవాలి.
– శంకర్లాల్, ఏవో, అయిజ.