మహబూబ్నగర్, ఆగస్టు 8 : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో రెండురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
జడ్చర్ల మండలంలో..
భారీ వర్షంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నాయి. జడ్చర్ల మం డలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారంవరకు దాదా పు 60మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గ్రామాల మధ్యనున్న వాగులను ఎవరూ దాటవద్దని అధికారులు కోరారు. అలాగే కుర్వపల్లి ఈదులచెరువు అలుగు పారుతున్నది. వరద ఎక్కువగా వస్తుండడంతో కొన్ని కాలనీల్లోకి నీరు వచ్చి చేరుతున్నదని సర్పంచ్ శ్రీనివాసులు తెలిపారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఆగస్టు 8 : మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. అలాగే పలు గ్రామాల్లో చెక్డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. లోకిరేవు చెరువు అలుగు పారడంతో దుందుభీవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 8 : మండలకేంద్రంతోపాటు పెద్దరేవల్లి, గౌతాపూర్, మోతీఘణపూర్, పెద్దాయపల్లి, గుండేడ్, సూరారం, నేరళ్లపల్లి, ఉడిత్యాల తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గౌతాపూర్ చిలాల్సాబ్ చెరువు, నేరళ్లపల్లి కుంటచెరువు అలుగు పారాయి. మోతీఘణపూర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, ఆగస్టు 8 : మండలకేంద్రంలోని మహ్మదాబాద్ బ్రాహ్మణ చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నది. అలాగే మల్కచెరువుకు వరద వచ్చి చేరుతున్నది. వర్షాలతో చెక్డ్యాంలు నిండి జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఆగస్టు 8 : రెండురోజలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సాలార్నగర్ ప్రాజెక్టుతోపాటు రెడ్డిపల్లి మల్లయ్య చెరువు, గండీడ్ ద్యావలి చెరువు అలుగులు పారుతున్నాయి. వెన్నాచేడ్, పగిడ్యాల్, పెద్దవార్వల్, కొంరెడ్డిపల్లి చెరువులకు వర్షపునీరు వచ్చి చేరుతున్నది. రంగారెడ్డిపల్లి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఆగస్టు 8 : మండలంలోని కొత్లాబాద్ చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నది. మూ డేండ్ల తర్వాత చెరువు అలుగు పారడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కొత్లాబాద్ చెరువు అలుగు పారుతుండడంతో అంకిళ్ల పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కోయిల్సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. కొత్లాబాద్ చెరువులో సర్పంచ్ చరితాదయాకర్రెడ్డి, మాధవరెడ్డి, రాజిరెడ్డి, మాధవులు పూజలు చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
హన్వాడ, ఆగస్టు 8 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ధనుంజయగౌడ్ సూచించారు. మండలంలోని గుడిమల్కాపూర్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నదని, కట్టకు అవసరమైన మరమ్మతు చేయించాలని సూచించారు. అలాగే వేపూర్ వాగు సమీప గ్రామాల రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
యన్మన్గండ్ల పెద్దచెరువుకు గండి
మండలంలోని యన్మన్గండ్ల పెద్దచెరువుకు గండి పడింది. పెద్దచెరువు కట్ట అకస్మాత్తుగా తెగిపోవడంతో 300 ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. మండలంలో ఆదివారం రాత్రి 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో యన్మన్గండ్ల పెద్ద చెరువులోకి భారీగా వరద వచ్చి అలుగు పారింది. చెరువుకు వరద ఉధృతి అధికం కావడంతో కట్టకు గండి ఏర్పడింది. చెరువు దిగువ ప్రాంతానికి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రైతులు సాగు చేసిన వరిపంట నీటమునిగి నష్టం వాటిల్లింది. కాగా, బాధిత రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. యన్మన్గండ్ల పెద్దచెరువు కట్ట తెగిపోవడం బాధాకరమని, పంటనష్టాన్ని అంచనా వేయిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎస్పీ వెంకటేశ్వర్లు, ఐబీ డీఈఈ సురేశ్, మండలస్థాయి అధికారులు చెరువు వద్దకు చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు నీటి ప్రవాహం ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని ఎస్పీ సూచించారు. అనంతరం ఇప్పటూర్ లెంకలచెరువును పరిశీలించారు. తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, జయమ్మాహన్మంతు, గౌసియాఅబ్దుల్లా ఇప్పటూర్ లెంకలచెరువు అలుగుకు రంధ్రాలు వేయించి ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.