నాగర్కర్నూల్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతోంది. ఈ తరుణంలో ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నది. 8న వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం, 9న ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ, 10న మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడం రన్ నిర్వహణ, 12న రాఖీ పండుగలో భాగంగా మీడియాలో వేడుకల ప్రసారం, 13న విద్యార్థులు, మహిళలు, యువతతో ఊరేగింపు, 14న సాంస్కృతిక కార్యక్రమాలు, పటాకుల వెలుగులు, 15న స్వాతంత్స్య్ర దినోత్సవ వేడుకలు, 16న ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపనలు, కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న క్రీడా పోటీలు, 19న దవాఖానలు, వృద్ధ, అనాథాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న పంచాయతీ, మండల, మున్సిపల్ సమావేశాలు, 22తో వేడుకలు ముగియనున్నాయి. మంత్రుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రతిరోజూ ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భారతదేశం ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచుకొని స్వాతంత్య్రం సాధించి 75ఏండ్లు పూర్తవుతున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో ద్విసప్తాహ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయిలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి 22వ తేదీ వరకు స్వాతంత్య్ర దినోత్సవాలు జరగనున్నాయి. ప్రజల్లో జాతీయ భావం పెంపొందించడమే ఉత్సవాల లక్ష్యమన్నారు. దీనికిగానూ పాఠశాల స్థాయి నుంచి జిల్లా పరిషత్ దాకా విద్యార్థులు, మహిళలు, యువత, అధికారులు ప్రజాప్రతినిధులనూ భాగస్వాములు చేసేలా కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని నింపేలా, జాతీయ నాయకులను స్మరించుకునేలా క్రీడాపోటీలు, కవి సమ్మేళనాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. జాతిపిత గాంధీజీ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని మరోసారి గుర్తు చేసేలా థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనలు జరగనున్నాయి.
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ చైర్మన్లుగా కలెక్టర్లు కన్వీనర్లుగా ఉండనున్నారు. ఇప్పటికే మంత్రుల సమక్షంలో జిల్లాస్థాయి అధికారుల సమావేశాలు నిర్వహించారు. పుర, పంచాయతీల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రతిరోజూ నిర్వహించే వేడుకలకు కమిటీల నియామకం పూర్తయ్యింది. ఇలా గ్రామ, మండలస్థాయిలోనూ కమిటీలను నియమించడం గమనార్హం. వజ్రోత్సవ వేడుకలతో జాతీయభావం వెల్లివిరిసేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ జాతీయ జెండాను ప్రభుత్వమే అందించనుంది. ఇప్పటికే జిల్లాలకు చేరుకొన్నాయి. ఈ నెల 15న ప్రజలంతా తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేసుకునే సువర్ణావకాశం రావడం విశేషం. ఈ జెండాలు ఇప్పటికే జిల్లాలకు చేరుకొన్నాయి. ఈ నెల 9నుంచి గ్రామాల్లో జెండాలను పంపిణీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు సైతం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రతిష్టాత్మకంగా వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 8నుంచి 22వరకు 15 రోజులపాటు కార్యక్రమాలు జరనున్నాయి. దీంతో 15రోజులు పల్లె నుంచి పట్నందాకా వేడుకలు కోలాహలంగా జరగనున్నాయి.
వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఇలా..
వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు నిర్వహించనున్నాం. ఈ నెల 8నుంచి 22వ తేదీ వరకు ప్రతిరోజూ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో వేడుకలు జరుగుతాయి. ఇప్పటికే జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా కార్యాచరణ రూపొందించాం. ఈ నెల 15న ప్రతి ఇంటిపై జెండా ఎగరేసుకోవచ్చు. తొలి విడుతలో జిల్లాకు లక్ష జాతీయ జెండాలు వచ్చాయి. త్వరలో మరో లక్ష జెండాలు వస్తాయి. మంగళవారం నుంచి జెండాల పంపిణీ ఉంటుంది. విద్యార్థులు, యువత, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొనాలి.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్