వనపర్తి టౌన్, జూన్ 9: పారిశుధ్యం, హరితహారం, నర్సరీలు తదితర అంశాలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి పట్టణంలోని 29, 9, 15, 32వ వార్డుల్లో ఆయన పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంగణ పరిధి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 15వ వార్డులోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి ప్రజలకు ఆహ్లాదరకరమైన వాతావరణం కల్పించాలన్నారు.
నర్సరీల్లోని మొక్కలను ఎప్పటికప్పుడు సందర్శించాలని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల, పాత కలెక్టర్ కార్యాలయం, మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని మురుగు కాలువలు, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలను, పారిశుధ్య పనులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఈనెల 18లోగా ఆయా వార్డుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి పాల్గొన్నారు.
అమరచింత, జూన్ 9: మండలంలోని ధర్మాపూర్, నాగల్కడ్మూర్, మస్తీపూర్ గ్రామాలను గురువారం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్కుమార్ ఆయా గ్రామాల పల్లెప్రగతి ప్రత్యేక అధికారులు వెంకటయ్య, నరసింహయ్యతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా డీపీవో, సర్పంచులు రాజేశ్వరమ్మ, గోపీరెడ్డితో గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులను, నర్సరీలను పరిశీలించారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్వ శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకుడు జమ్ములు ఉన్నారు.
పాన్గల్, జూన్ 9: మండలంలోని కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లితండా, బుసిరెడ్డిపల్లి, అన్నారం, అన్నారంతండా తదితర గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి పనులు కొనసాగాయి. మండల ప్రత్యేకాధికారి సురేశ్, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో సందర్శించి పారిశుధ్యం, మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. ‘మనఊరు -మనబడి’ కార్యక్రమంలో పాఠశాలల్లో చేపడుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మణ్నాయక్, పంచాయతీరాజ్ ఏఈ సత్తయ్య పాల్గొన్నారు.
గోపాల్పేట, జూన్ 9 : మండలంలోని తాడిపర్తి గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను గురువారం ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి మండల ప్రత్యేకాధికారి అనీల్కుమార్, ఎంపీడీవో కరుణశ్రీతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, ఎంపీవో హుస్సేనప్ప, ఏపీవో నరేందర్, మిషన్ భగీరథ ఏఈ మొగులయ్య, విద్యత్ ఏఈ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.
ఆత్మకూరు, జూన్ 9: పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ప్రగతి పనులు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 7వ వార్డులో ప్రగతి పనులు నిర్వహించారు. పాడుపడ్డ ఇండ్లను తొలగించి ఇంటింటా పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కమిషనర్ రమేశ్ పాల్గొన్నారు.
మదనాపురం, జూన్ 9: పల్లెప్రగతి పనులు గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నాయని మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున్ అన్నారు. గురువారం తిర్మలాయపల్లి గ్రామాన్ని ఎంపీడీవో నాగేంద్రంతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, ఎంపీవో పుష్ప, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.