గద్వాల, ఆగస్టు 17: రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని జెడ్పీచైర్పర్సన్ సరిత పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు కౌన్సిలర్లు రక్తదానం చేయగా వారికి జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్పర్సన్ మాట్లాడుతూ.. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాయని, ఇక్కడ దానం చేసిన రక్తంతో ఎందరికో ప్రాణాలు పోసిన వారు అయ్యారని పేర్కొన్నారు. జిల్లాలోని యువతీ, యువకులు అవసరమైన సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు నిలిపిన వారమవుతామన్నారు. ప్రతి మూడునెలకోసారి రక్తదానం చేయొచ్చని చెప్పారు. రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకొని ఇతరులకు ఆరద్శంగా నిలవాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈనెల 22వరకు జరిగే వజ్రోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మొత్తం 94మంది యువకులు రక్తదానం చేశారని రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం రూ.16 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారి చందూనాయక్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, దవాఖాన సూపరింటెండెంట్ కిశోర్కుమార్, ఆర్డీవో రాములు, తాసిల్దార్ లక్ష్మి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి, ఆగస్టు 17: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సీఐ శివశంకర్ అధ్యక్షతన ప్రభుత్వ దవఖానలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో యూత్ఫర్ పబ్లిక్ టీం నాయకుడు శేషు ఆధ్వర్యంలో 15మంది యువకులు రక్తదానం చేశారు. సేవే లక్ష్యంగా పనిచేస్తున్న తమకు రక్తదానమివ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని శేషు అన్నారు. కార్యక్రమంలో లక్ష్మణస్వామి, రవి, విజయ్, శ్రీకాంత్, వరప్రసాద్, సుధాకర్, రుక్మంత్ పాల్గొన్నారు.