గద్వాల, జూలై 3: రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పాం సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భా గంగా జిల్లాలో ఈ పంటను సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహి స్తున్నది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుకింద జోగుళాంబ గద్వాల జిల్లాను ఎంపిక చేసి ఆయిల్పాం సాగు చేపట్టిన ప్రభుత్వం రైతులకు సబ్సిడీ లు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నది.
సుమారు ఈపంట 35 ఏండ్లపాటు దిగుబడిని అందిస్తుండడంతో ఆయిల్పాం సాగుద్వారా రైతులు లాభాలు ఆర్జించే అవకాశం కల్పించింది. అధికారులు ఈ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు వంట నూనెల డిమాండ్ పెరుగుతున్న తరుణంలో మన రాష్ట్రంలో ఆయిల్పాం సాగు పెరిగితే విదేశాలపై ఆధారపడడం తగ్గడంతోపాటు మనకు సరసమైన ధరలకు వంటనూనెలు దొరికే అవకాశం ఉంది. గత ఏడాది జిల్లాలో 356మంది రైతులకు సంబంధించి 1479.62 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేశారు.
ఈ ఏడాది జిల్లాలో ఆయిల్పాం సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో 2022-2023 సంవత్సరానికిగానూ 7,070 ఎకరాల సాగు లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖలను ఆదేశించింది. లక్ష్యం సాధించే దిశగా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులు, టీఎస్ అయిల్ఫెడ్ క్షేత్రస్థాయి సిబ్బంది, డ్రిప్ కంపెనీల సహకారంతో ఇంతవరకు జిల్లాలో 189మంది రైతులకు చెందిన 845 ఎకరాలను గుర్తించి మొక్కలు నాటారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ నెల 1న జిల్లాలో పెద్ద ఎత్తున రైతుల పొలాల్లో ఒకేరోజు 25వేల మొక్కలు నాటారు. మొక్కలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో రైతులు ముందుకు వస్తున్నారు. ఆయిల్పాం మొక్క ఖరీదు రూ.193కాగా అందులో రాయితీ రూ.173పోగా మిగిలిన రైతు వాటా రూ. 20 డీడీ రూపంలో చెల్లించగా రైతులు తమ పొలాల్లో గుంతలు తీసి డ్రిప్ పరికరాలు ఏర్పాటు చేసుకోగా 115మంది రైతులకు సంబంధించి 500ఎకరాల్లో ఒకే రోజు 25వేల మొక్కలు నాటడంతో జిల్లాలో రైతులు ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
ఆయిల్పాం సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో జిల్లాలో రైతులు ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరా పొలంలో 57 మొక్కలు నాటవచ్చు. ఒక మొక్క ధర రూ.193కాగా ప్రభుత్వం రూ.173 రాయితీ ఇస్తుంది. రైతు మొక్కకు రూ.20 చొప్పున చెల్లిస్తే చాలు. మొక్కలు అందిస్తుంది. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.4వేల చొప్పున నాలుగేండ్లు ప్రోత్సాహం అందిస్తుంది.
మొక్కల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల వద్ద కు డ్రిప్ సిబ్బందివచ్చి సర్వేచేసి ఆతర్వాత డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. కేంద్రంకూడా ఆయిల్పాం సాగు చేసే రైతులకు మిషన్ ఫర్ అయిల్ సీడ్ అండ్ ఆయిల్పాం పాలసీ తీసుకొచ్చింది. రూ.11,040 నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తోడు కేంద్రం నిధులు కూడా రైతులకు అందనున్నాయి. ప్రభుత్వ సహకారంతో రైతులు ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపడంతో అధికారులు అనుకున్న లక్ష్యానికి చేరువులోఉన్నారు.