మహబూబ్నగర్, జూలై 2 : డీసీసీబీ.. బలహీన స్థాయి నుంచి బలమైన స్థాయికి చేరుకున్నది. ఉమ్మడి పరిపాలనలో డీసీసీబీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. ప్రస్తుతం చిరువ్యాపారుల నుంచి బడా వ్యాపారులకు సైతం రు ణాలందిస్తున్నది. రోజువారీ కలెక్షన్లు తీసుకుం టూ చిరువ్యాపారులకు భరోసా కల్పిస్తున్నది. రాష్ట్రంలో ఏ సహకార బ్యాంకైనా నిరర్థక ఆస్తు లు పది శాతానికి మించి ఉంటే ఆ బ్యాంకును బలహీనమైనదిగా గుర్తిస్తారు. పదేండ్లుగా బలహీనంగా ఉన్న సహకార బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలో నిరర్థక ఆస్తులను 7.36 శాతానికి తగ్గించి బలమైన బ్యాంకుగా మారింది. దీంతో నూతన పథకాలకు అంకుర్పారణ చేస్తూ డీసీసీబీ పాలకమండలి అడుగులు వేస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సహకార బ్యాంకు రూ.146.25 కోట్ల వ్యాపారాన్ని పెంచి రూ.1,196.59 కోట్లకు చేరుకున్నది. బ్యాంకు మూలధనం రూ.86.64 కోట్ల నుంచి రూ.91. 40 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు రూ.2 కోట్లు పెరిగి రూ.318.27 కోట్లకు చేరుకున్నది. బ్యాం కు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16.68 కోట్ల లాభాలను అర్జిస్తున్నారు. వివిధ రంగాల్లో రూ.930.41 కోట్ల రుణాలను బట్వాడా చేసింది. అందులో స్వల్పకాలిక పంట రుణాల కోసం 1,04,831 మందికి రూ.732.05 కోట్లు ఇచ్చారు. దీర్ఘకాలిక రుణాల్లో 364 మెంబర్లకు రూ.15.58 కోట్లు ఇవ్వగా.. బంగారు అభరణాలను తాకట్టు కింద రూ.118.71 కోట్ల రుణాలను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు రూ.64 కోట్లు ఇతరులకు బట్వాడా చేశారు.
డీసీసీబీ అంటే ఎప్పుడూ నిధులు ఉండవు. రుణాలు ఇచ్చినా 10, 15 మంది రైతులకే ఇస్తారు అనే రోజులకు కాలం చెల్లింది. ఈ నెల నుంచి రైతులకు గృహ రుణాలతోపాటు వారి పిల్లలు విదేశాల్లో చదివేందుకు రుణాలిచ్చేలా నూతన విధానాలకు అంకురార్పణ చేసింది. రుణాలు అందించడంతోపాటు సేకరణలోనూ వినూత్న రీతిలో ముందుకు సాగుతున్నది. దీంతో మొండి బకాయిలు సైతం వసూలు చేస్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం లో వచ్చాక డీసీసీబీ పాలకవర్గానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. రైతుల సంక్షేమం కోసం రుణాలను అందిస్తూ వారి ఎదుగుదలతో మరింత ముం దుకు వేస్తున్నది.
డీసీసీబీని పక్కా ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాంకు అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నాం. ప్రతి విషయంలోనూ పాలకవర్గంతో సమీక్షించుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. గృహరుణాలు, విదేశాల్లో చదివే విద్యార్థులకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందరినీ ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు డీసీసీబీ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నది.
– నిజాంపాషా, డీసీసీబీ చైర్మన్, మహబూబ్నగర్