మహబూబ్నగర్, జూలై 2 : ఎస్సీ వర్గీకరణను బీజేపీలో తుంగలో తొక్కి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్మాదిగ అన్నారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి రూరల్ పీఎస్కు తరలించడం సరైన విధానం కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
భూత్పూర్, జూలై 2: అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014లో హామీ ఇచ్చారని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బోరింగ్ నర్సింహులు అన్నారు. శనివారం హైదరాబాద్లో బహిరంగ సభకు వస్తున్న సందర్భంగా ప్రధానిని అడ్డుకునేందుకు వెళ్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి హోదాలో వస్తున్న నరేంద్రమోదీ ఎదుట ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలనుకోవడం తప్పా? అన్ని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గడ్డం రాములు, యాదయ్య, ఎల్లప్ప, అంజి, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల) జూలై 2: మండలంలోని శాఖాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎల్అండ్టీ వెస్ట్రన్ ఆంధ్ర టోల్వేస్ వద్ద శనివారం జాతీయ రహదారి దిగ్భంధంలో భాగంగా ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ వర్గీకరణ చేపడుతామని ఇచ్చిన హామీని రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా చేయకపోవడానికి నిరసనగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారి దిగ్భంధానికి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
అందులో భాగంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్మాదిగ, భరత్ మాదిగ, కేశవులు మాదిగ, శంకర్మాదిగతోపాటు పలువురు సభ్యులు ఎల్అండ్టీ టోల్ప్లాజా వద్ద బైఠాయించి ధర్నా చేశారు. బందోబస్తును పరిశీలించడానికి వచ్చిన ఏఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్, సీఐ రజితారెడ్డి, మహేశ్వర్తోపాటు ఎస్సైలు వెళ్లి వారిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
మూసాపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా చేసేందుకు ఎంఆర్పీఎస్ నాయకులు వచ్చారని ఎస్సై నరేశ్తోపాటు, సీఐ రజితారెడ్డి, పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసేందుకు శనివారం ఉదయం వ్యవసాయ పొలాల వెంట ఉరుకులు, పరుగులు పెట్టారు. జాతీయ రహదారిపై పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేసి, ధర్నా చేసేందుకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.