కల్వకుర్తి, జూన్ 22 : మున్సిపాలిటీలో సీసీ రోడ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మిషన్ భగీరథ పైప్లైన్ వేయడం వల్ల దెబ్బతిన్న సీసీరోడ్లకు మరమ్మతులు మొదలయ్యా యి. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా రోడ్డు వెడల్పును ఐదున్నర మీటర్లుగా మారుస్తూ రోడ్లు వేస్తున్నారు. దీంతో కాలనీలకు వెళ్లే సీసీ రోడ్డు మరింత వెడల్పుగా మారనున్నాయి. కాలనీలకు వెళ్లే సీసీ రోడ్లను వెడల్పుగా మారుస్తూ కొత్తగా రోడ్లు వేస్తుండటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీలో 6 రోడ్లను 5.5 మీటర్ల వెడల్పు చేస్తూ మూడున్నర కిలోమీటర్ల రోడ్డుకు రూ.3కోట్లు మంజూరయ్యాయి. కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్లను గుర్తించి మున్సిపాలిటీలో తీర్మానాలు చేశారు. ఇందులో ఉన్న రోడ్లన్నీ మిషన్ భగీరథ పథకంలో భాగంగా వేసిన తాగునీటి పైప్లైన్ల వల్ల రోడ్డుకు ఒక వైపున దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న క్రమంలో మున్సిపాలిటీ అధికారులు కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు తీర్మానాలు చేశారు. ఈక్రమంలో దెబ్బతిన్న 4మీటర్లు వెడల్పు కలిగిన సీసీరోడ్లను 5.5 మీటర్ల వెడల్పు చేసేలా నిధులు మంజూరయ్యాయి.
సిల్వర్ జూబ్లీ క్లబ్ నుంచి బ్రహ్మంగారి ఆలయ రోడ్డు, ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్ నుంచి విద్యానగర్ కాలనీకి వెళ్లే రోడ్డు, తిలక్నగర్ కమాన్ నుంచి కొల్బావి వెళ్లే రోడ్డు, కన్యకాపరమేశ్వరీ ఆలయ కమాన్ నుంచి శివాలయం వరకు, ఎల్లికల్ రోడ్డు నుంచి పాల కల్వకుర్తికి వెళ్లే రోడ్డు, నాగర్కర్నూల్ చౌరస్తా నుంచి హైటెన్షన్ స్తంభం వరకు మూడున్నర కిలోమీటర్ల మేర 5.5మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మించనున్నారు.
5.5 వెడల్పుతో చేపట్టిన ఆరు రోడ్ల పనులు చురుకుగా సాగుతున్నాయి. రెండు వారాల కిందట ఈ పనులకు ఎమ్మె ల్యే జైపాల్యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం శంకుస్థాపన చేశారు. రోడ్డు వెడల్పు పనులు చేసేందుకు సీసీ రోడ్లకు ఇరువైపులా కొత్తగా సీసీ వేసేందుకు పనులు ప్రారం భమయ్యాయి.
మిషన్ భగీరథ రోడ్డు పనుల్లో దెబ్బతిన్న రోడ్లే కాకుండా ప్రతి కాలనీలో సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించి ప్రతి కాలనీకి అభివృద్ధి చార్ట్ తయారు చేశారు. ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమృద్ధిగా నిధులు మంజూరయ్యాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో మున్సిపాలిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నాం.
– ఎడ్మ సత్యం, మున్సిపల్ చైర్మన్, కల్వకుర్తి
మా వార్డులో కన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి శివాలయం వరకు 5.5 మీటర్ల వెడల్పు కలిగిన 650 మీటర్ల మేర సీసీరోడ్డు నిర్మించేందుకు ప్రొసీడింగ్ వచ్చింది. దేవరకొండ రోడ్డు నుంచి కల్వకుర్తి కూరగాయల మార్కెట్కు వెళ్లేందుకు ఇది ప్రధానమైన రోడ్డు. ఇదే విషయాన్ని మున్సి పల్ పాలకమండలి సమావేశంలో చర్చించి తీర్మానం చేయడంతో నిధులు మంజూరయ్యాయి. రోడ్డు పనులు ప్రారంభించాం. కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంకు కృతజ్ఞతలు.
-సౌజన్యారెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ , కల్వకుర్తి