భూత్పూర్, జూన్ 22 : ప్రజాసమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండ ల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్దిగట్ల పాఠశాల ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా విధులకు హాజరు కావడంపై ఎంఈవో నాగయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు పాఠశాలకు సకాలంలో రావాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం తో పాఠశాలలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు.
అనంతరం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరగా, ఏఈ ప్రదీప్ స్పందిస్తూ పైపులైన్ లీకేజీలకు తక్షణమే మరమ్మతు చేయిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో మున్ని, తాసిల్దార్ చెన్నకిష్టన్న, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్ ఉన్నారు.