ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల కోసం ప్రయత్నాలు
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 28: జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగిసిన తదుపరి పోటీ పడుతున్న అభ్యర్థులు పోలింగ్ చీటీల పంపిణీకి సిద్ధమయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 27వార్డుల్లో మొత్తం 112మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డులకు సంబంధించిన అభ్యర్థులు తమ వార్డుల్లోని ఓటర్ల చిరునామాల ఆధారంగా పోలింగ్ చీటీల పంపిణీకి సిద్ధమయ్యారు. వార్డుకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఎన్నికల అధికారులు సైతం వార్డుల వారీగా అంగన్వాడీల సహకారంతో ఇంటింటికెళ్లి ఓటర్లకు పోలింగ్ చీటీలు అందించారు.జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 27వార్డుల్లో తలపడుతున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. మంగళవారం నాటికే బహిరంగ ప్రచారం సమయం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు అంతర్గతంగా ఇంటింటికెళ్లి ఓటర్లను కలసి ఓటు వేయాలని కోరుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.