మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాల
గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తిలో రీజనల్ సబ్ సెంటర్లు
ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ఉమ్మడి జిల్లాకు మరింతగా వైద్య సదుపాయాలు
మహబూబ్నగర్, మే17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరో ప్రభుత్వ మెడికల్ కళాశాల రానున్నది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందు లో వనపర్తి జిల్లాకు ఒకటి కేటాయించారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు కానున్నది. నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ దవాఖాన ల్లో పేదలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించేందుకు కొత్తగా 12 రీజనల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వీటిలో మూడింటిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించారు. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రీజినల్ సబ్ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ దవాఖాలకకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి లేదా సొంత ప్రాతిపదికన వాహనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మందులు నిల్వచేసేందుకు సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో మరింత వైద్య సేవలను విస్తరిస్తున్న సీఎం కేసీఆర్కు జిల్లా వాసులు కృతజ్ఞతలు చెబుతున్నారు.