మూసాపేట, జూలై 9 : చెరువును అక్రమించడంతోపాటు, ప్రభుత్వ నిధులు వెచ్చించి నిర్మించిన చెక్డ్యాంను కూల్చివేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ తాసిల్దార్ మంజులను ప్రశ్నించారు. శుక్రవారం మూసాపేట తాసిల్దార్ కార్యాలయానికి జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్తోపాటు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, గూపని కొండయ్య వెళ్లి తాసిల్దార్తో మాట్లాడారు. ఫాం ల్యాండ్ల పేరుతో కొమిరెడ్డిపల్లిలో చెరువును ఆక్రమించారని, దాసరిపల్లిలో చెరువు కాల్వను ఆక్రమించి గుంట, రెండు గుంటలను ప్లాట్లుగా విక్రమిస్తున్నారని ఎంపీపీ, జెడ్పీటీసీ ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఆక్రమణదారులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని తాసిల్దార్ను, ఆర్ఐ మమతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మంజుల మాట్లాడుతూ కొమిరెడ్డిపల్లిలో సర్వే చేయించామని, ఎనిమిదెకరాలు ఎఫ్టీఎల్ భూమిని ఆక్రమించినట్లు గుర్తించామని చెప్పారు. ఎఫ్టీఎల్తోపాటు, బఫర్జోన్ పరిధి వరకు నిర్మించిన ప్రహరీని తొలగించాలని సూచించినట్లు తెలిపారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ వెంటనే నోటీసులు జారీ చేసి, ప్రహరీని తొలగించాలని కోరారు. అనంతరం జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం డీటీసీపీ లేవుట్ల అనుమతులపై పర్యవేక్షణ చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇస్తుందన్నారు. కానీ ఇంత పెద్దఎత్తున వందల ఎకరాల్లో ఫాం ల్యాండ్ల పేరుతో ప్లాట్లుగా అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అధికారులకే తెలియాలన్నారు. ఫాం ల్యాండ్లతో ప్రభుత్వ ఖజానాకు, అటు గ్రామ పంచాయతీకి నష్టం జరుగుతుందన్నారు.