వైద్య చరిత్రలో మరో ముందడుగు
ఒకేరోజు 19 జిల్లాల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లు ప్రారంభం
వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తిలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్ ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహంతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఒకేసారి 19 జిల్లాల్లో డయాగ్నొస్టిక్స్ సెంటర్లు ప్రారంభించడం వైద్యచరిత్రలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా 57పరీక్షలు చేస్తారని ఇది పేదలకు వరమన్నారు.
ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ ల్యాబ్లకు పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తే వేలల్లో బిల్లులు అయ్యేవని, ప్రస్తుతం ఖర్చు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాబ్లో పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కిమోథెరఫీ, ఈసీజీ, మహిళలకు వచ్చే రెండు రకాల క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా జిల్లాల్లో వ్యవసాయరంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. జిల్లాలో కొండాపురం వద్ద ఆహార పరిశ్రమకు స్థలం గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరైందని త్వరలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గద్వాల ప్రాంతం విత్తన పత్తి సాగుకు ప్రసిద్ధి అన్నారు.
సీఎం సహాయనిధికి బిల్లుల్లో వైద్యుల ఖర్చు తక్కువ పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉంటుందని దీంతో సామాన్యుడిపై భారం పడుతుందన్నారు. దీనిని నివారించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం క్యాన్సర్ సోకి ఎవరైనా దవాఖానలో చేరితే వారి కోసం ఏర్పాటు చేసిన వార్డును ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రారంభించారు. అదేవిధంగా డయాగ్నొస్టిక్ సెంటర్లో ఎంపీ రాములు పరీక్షలు చేయించుకున్నారు. దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ పాల్గొని రోగులకు వారి బంధువులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతిఓఝా, అదనపు కలెక్టర్ రఘురాంశర్మ, ఆర్డీవో రాములు, ఎస్పీ రంజన్ రతన్కుమార్, వైద్యాధికారి చందునాయక్, దవాఖాన సూపరింటెండెంట్ శోభరాణి, మున్సిపల్ చైర్మన్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరి, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, డాక్టర్ శశికళ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు
వనపర్తి, జూన్ 9: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను ఎంపీ రాములుతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి 24మంది లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం వేల కోట్ల నిధులతో నిర్మించి అందిస్తున్నదని, పేద ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండేలా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రాన్ని త్వరలో మరింత సుందరంగా తీర్చిది ద్దుకుందామని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్లు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు ‘కల్యాణలక్ష్మి’
వనపర్తి, జూన్ 9: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం, అనారోగ్యం బారిన పడిన వారికి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 161మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు, 59మందికి సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ.14లక్షల 50వేల 500 చెక్కులను బుధవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఇది సంక్షేమ రాష్ట్రమని, ప్రజలందరూ బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే ప్రభుత్వానికి బలం, బలగమని మంత్రి వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం ఆర్థికసాయం చేయలేదని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116 ఇస్తూ ఇంటి పెద్దగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నాడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.