సమైక్య రాష్ట్రంలో ముందస్తు సాధ్యమయ్యేదా..?
ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి
ఉంద్యాల పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్కు నీటి విడుదల
మహబూబ్నగర్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో జూరాల, శ్రీశైలం, సాగర్ నిండకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు సాగునీరు అందించిన చరిత్ర లేదని దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే జూరాలకు వచ్చిన తొలి నీటిబొట్టును ముందుగా మన ప్రాజెక్టులకే మళ్లించుకునే అవకాశం వచ్చిందని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల పంప్హౌస్ స్టేజ్-1 నుంచి కోయిల్సాగర్ ప్రాజెక్టుకు జూరాల నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సుమారు 25వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో జూరాల పై ఆధారపడిన అన్ని ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిన తర్వాతే జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు సాగునీటిని వదిలే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జూరాలకు పైనుంచి వరద వచ్చిన వెంటనే పాలమూరు ప్రాజెక్టులన్నింటికీ నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. చరిత్రలో తొలిసారి జూన్ 9వ తేదీనే జూ రాలపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టులకు సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఉద్యమ ఫలాలు ఒక్కొక్కటిగా కండ్లముందు సాక్షాత్కరిస్తున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. చెరువుల్లో నీళ్లు ఇంకా తగ్గిపోకముందే ప్రాజెక్టులకు నీళ్లు వదలడం నమ్మలేని విధంగా ఉందన్నారు. ఎగువ నుంచి వరద వస్తున్నందున నది నుంచి మోటార్లు వేసుకున్న రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.