ఈవో కేఎస్ రామారావు
శ్రీశైలం, మే5: శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మొదలుపెట్టిన పరోక్ష సేవలను మరింత విస్తృతం చేసే దిశగా సాంకేతిక చర్యలు మెరుగుపర్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే భక్తులు క్షేత్రానికి వచ్చి నిత్యం ఆర్జిత సేవలలో నేరుగా పాల్గొనే అవకాశం లేనందున రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా నిర్ణీత సేవలలో తమ గోత్రనామాలు నమోదు చేసుకునేందుకు www.srisailadevasthanam.org వెబ్సైట్ ద్వారా వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ వెబ్సైట్ నుంచి నేరుగా స్వామి, అమ్మవార్లకు మొక్కులు, కానుకలు సమర్పించేందుకు వీలుగా ఈ హుండీ కూడా అందుబాటులో ఉండేలా కట్టుదిట్టమైన సాంకేతికను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్లో సేవా కార్యక్రమాలను చేయించుకున్న వారికి విభూది, కైలాస కంకణాలు, పసుపు కుంకుమలు పోస్టల్ ద్వారా పంపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్వామి, అమ్మవార్ల కైంకర్యాలను ఇంటర్నెట్లో శ్రీశైల టీవీలో ప్రసారాలను వీక్షించవచ్చని ఈవో తెలిపారు. సంబంధిత సమాచారాన్ని కాల్సెంటర్ 8333901351,52,53, 54, 55, 56 నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.
కరోనా ఉధృతి
శ్రీశైల మహా క్షేత్రంలో రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు అమలయ్యేలా క్షేత్రానికి వచ్చే యాత్రికులు సహకరించాలని ఈవో కేఎస్ రామారావు కోరుతున్నారు. ఆలయ సిబ్బంది సహా స్థానికుల్లో కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నందున క్షేత్రంలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. ఉదయం ఆరుగంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే స్వామి, అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే వారు వ్యాక్సినేషన్ రశీదులు లేదా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు వెంట తీసుకువచ్చిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని చెప్పారు.