నారాయణపేట, జూన్ 6 : ‘అభివృద్ధే అభిమతంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.. ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు పట్టుకోసం పాకులాడుతున్నాయి.. ఒకరికి కులం పిచ్చి ఉంటే.. మరొకరికి మతం పిచ్చి చుట్టుకున్నది. కాంగ్రెస్ నేతల చేతిలో కత్తిలేదు.. బీజేపీ నాయకులకు నెత్తిలేదు.. వారి మాటలు అలాగే ఉన్నాయి’.. అని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సోమవారం నారాయణపేట జిల్లాలో రూ.64.43 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కలిసి అప్పక్పల్లి గ్రామ శివారులో జరిగిన బహిరంగ సభకు మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన చెల్లింపులను వెంటనేరాష్ట్ర బీజేపీ నేతలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే తెలంగాణలో ప్రధాని మోదీ అడుగు పెట్టాలని సూచించారు.
కాంగ్రెస్ చేతిలో కత్తిలేదు.. బీజేపీ నాయకులకు నెత్తిలేదని, ఒకరికి కులం పిచ్చి పట్టుకుంటే.. మరొకరికి మతంపిచ్చి పట్టుకుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన ఆయన రూ.64కోట్ల 43లక్షలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నారాయణపేట మండలం అప్పక్పల్లి గ్రామశివారులో నూతనంగా ఏర్పాటు చేయనున్న 390 పడకల జిల్లా దవాఖాన ప్రాంగణంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు.
70ఏండ్లల్లో గత ప్రభుత్వాలు రాష్ట్రంలో కేవలం మూడు వైద్య కళాశాలలను మాత్రమే ఏర్పాటు చేయగా, ఏడేండ్లలో వైద్య కళాశాలల సంఖ్యను 33కు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కడో మూలకు పడి ఉన్న నారాయణపేటను రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. కిడ్నీ సమస్యలు వస్తే ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా డయాలసిస్ చేయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇక్కడి పిల్లలు వైద్యవిద్యను అభ్యసించడానికి మెడికల్ కళాశాల మంజూరు అయినట్లు చెప్పారు.
ఒకరికి కత్తిలేదు… మరొకరికి నెత్తిలేదు
ఒకరికి కత్తిలేదు… మరొకరికి నెత్తిలేదు.. అన్న చందంగా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పరిస్థితి మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. అరచేతిలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వైకుంఠాలు చూపుతున్నారని, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై బట్టకాల్చి పైన పడేసే యత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రక్కనున్న కర్ణాటకలో రైతులకు ఆరు గంటల కరెంట్ ఇస్తే, మన రాష్ట్రంలో 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ అందిస్తున్నామన్నారు. అక్కడ పింఛన్ రూ.500 ఇస్తే, ఇక్కడ రూ.2016 ఇస్తున్నామన్నారు.
మన రాష్ట్రంలో రైతు చనిపోతే రైతుబంధుతో రూ.5లక్షలు అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తామని, ఈ విధంగా కర్ణాటకలో రైతులను ఆదుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతు పండించిన ప్రతి గింజనూ కొంటున్నామని, ఇలాంటి కేంద్రాలు బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఒక్కటి కూడా లేవన్నారు. నారాయణపేటకు కూతవేటు దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పరిపాలిస్తుంది కదా.. అక్కడ ఇలాంటి కేంద్రాలు ఒక్కటైనా ఉన్నాయా అనే విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం ఇవ్వాలన్నారు. మన రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఫిల్టర్ చేసిన నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, అదే బీజేపీ రాష్ట్రంలో ఒక్క చోటైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి
కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు, మధ్యప్రదేశ్లోని పెన్గంగ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వడంలేదని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉలుకుపలుకు లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని పాలమూరు – రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఈ పథకానికి జాతీయ హోదా ప్రకటించిన తర్వాతే మోదీ రాష్ట్రంలో కాలు పెట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నుంచి బకాయిలను తీసుకరావాలి
గ్రామపంచాయతీల అభివృద్ధికి నేటివరకు రూ.11వేల 700 కోట్ల నిధులను ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. ఈ నిధులతో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతువేదికలు, డంపింగ్యార్డులను నిర్మించడంతోపాటు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ రెండేండ్లలో ఒక్క పట్టణ, పల్లెప్రగతి కోసం రూ.1,144 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. రాష్ర్టానికి కేంద్రం నుంచి మూడు నెలలుగా రావాల్సిన రూ.11వేల కోట్లను రాష్ట్ర బీజేపీ నాయకులు రాబట్టాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లలో దేశంలో 157 మెడికల్ కళాశాలలను కేంద్రం మంజూరు చేయగా, తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా మంజూరు చేయలేదన్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని విన్నవించినా పెడిచెవిన పెట్టి రూ.21వేల 961 కోట్ల వ్యయంతో గుజరాత్కు రైల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేశారన్నారు.
అభివృద్ధే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్గౌడ్
ప్రతిపక్షాలలో ఒకరు కులంపేరుతో, మరొకరు మతంపేరుతో రాజకీయాలు చేస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి మతంతో ముందుకు వెళ్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్ తర్వాత నారాయణపేట మున్సిపాలిటీగా అవతరించిందన్నారు. ఇక్కడి చీర లు, బంగారం ప్రసిద్ధిగాంచిందన్నారు. అలాంటి నారాయణపేటను గత ప్రభుత్వాలు విస్మరించి పూర్తి వెనుకబాటుతనానికి కారణమయ్యారని అన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లాగా ఏర్పడి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ లైన్ రోడ్లు, డివైడర్లు, మధ్యలో చెట్లు, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్, జిల్లా దవాఖాన ఏర్పాటుతో నారాయణపేట రూపురేఖలు మారిపోయాయన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, సామాన్య ప్రజానీకానికి అన్ని రంగాల్లో పెద్దపీట వేయడంవల్ల నేడు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు. యాదాద్రి వంటి పెద్ద ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు.
జిల్లా ఏర్పాటుతో ఘననీయమైన ప్రగతి
నారాయణపేట జిల్లా ఏర్పడిన తర్వాత ఘననీయమైన అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. రూ.56కోట్లతో 390 పడకల దవాఖానను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంగణంలో మెడికల్ కళాశాలను సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కిడ్నీ బాధితులకు ఇక్కడే ఉచితంగా డయాలసిస్ చేసుకొనే సదుపాయం కలిగిందన్నారు. కొవిడ్ సమయంలో అత్యల్పంగా కేసులు నమోదైన జిల్లాగా నారాయణపేట నిలిచిందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలో నెలకు 90 నుంచి 100 ప్రసవాలు మాత్రమే జరిగేవని, కేసీఆర్ కిట్తోపాటు ఆధునిక సదుపాయాలు కల్పించడంతో నెలకు 300లకు తగ్గకుండా ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. 100 పడకల పిల్లల దవాఖానలో ఐసీయూ, పీఐసీయూలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ దవాఖానలో క్యాడర్ సంఖ్యను పెంచాలని, జిల్లాలో ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ప్రభుత్వ దవాఖానలో డైట్, శానిటేషన్ టెండర్లు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు ఇక్కడి ప్రభుత్వ దవాఖానల్లో నియమించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణబట్టడ్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, సర్పంచులు వెంకటమ్మ, సుగుందమ్మ పాల్గొన్నారు.
సీజేరియన్ ఆపరేషన్లపై మంత్రి సీరియస్
నారాయణపేట జిల్లాలోని 21 ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలకంటే సీజేరియన్ ఆపరేషన్లు ఎక్కువ సంఖ్యలో కావడంపై మంత్రి హరీశ్రావు సీరియస్ అయినట్లు తెలిసింది. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం జిల్లా దవాఖాన వైద్యులతోపాటు జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలకు చెందిన గైనాకాలజిస్టులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2022 జూన్ నాల్గోతేదీవరకు ప్రైవేట్ దవాఖానల్లో జరిగిన సాధారణ, సీజేరియన్ ప్రసవాల జాబితాను ముందు పెట్టుకొని వైద్యులతో నేరుగా మాట్లాడారు. ఒక్కో దవాఖానలో 100శాతం ఉండగా, మరికొన్ని దవాఖానల్లో 80-90 శాతం వరకు సీజేరియన్ ఆపరేషన్లు జరిగినట్లు రికార్డులు ఉన్నాయి. కొన్ని దవాఖానల్లో అయితే గైనాకాలజిస్టులు లేనప్పటికీ సర్జన్ ద్వారా ఆపరేషన్లు చేయించినట్లు కూడా మంత్రి దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరుగుతుంటే.. ప్రైవేటు దవాఖానల్లో సీజేరియన్ ఆపరేషన్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయని ప్రశ్నించినట్లు సమాచారం. ఇకపై సాధారణ ప్రసవాలపైనే దృష్టి సారించాలని, లేకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.
పేటకు వరాల జల్లు
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అభ్యర్థన మేరకు జిల్లాకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నామని, వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే విధంగా ఆదేశాలు ఇస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ధన్వాడకు 108 అంబులెన్స్ను మంజూరు చేస్తామన్నారు. టీ – డయగ్నోస్టిక్ సెంటర్, రెడియాలజీ సెంటర్లను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించేందుకు వెంటనే రూ.2కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కోయిల్కొండ పీహెచ్సీని వైద్యవిధాన పరిషత్లో విలీనం చేసేందుకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు. 95శాతం స్థానికులకు ఉద్యోగాలు వచ్చేవిధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని వల్ల గ్రూప్-4, ఉపాధ్యాయ పోస్టులు స్థానికులకు దక్కుతాయని వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రారంభిస్తున్నామని, ఇక నుంచి ప్రైవేటు పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపించాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న దర్జీ కథ
బహిరంగసభలో మంత్రి హరీశ్రావు చెప్పిన దర్జీ కథకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక దర్జీ బట్టలు కుడుతుండగా సూది కింద పడిపోగా.. ఎంత వెతికినా దొరకపోవడంతో సూది దొరికితే కిలో చక్కెర పంచుతానని దేవుడిని మొక్కతాడంటా.. అక్కడే ఉన్న దర్జీ భార్య రూపాయి సూది కోసం 50 రూపాయల చక్కెర పంచుతావా నీవు ఏం మనిషివయ్యా అనగా, తిక్కదానా సూది దొరికినప్పుడు కదా చక్కెర పంచేది అన్నాడంటా… రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. కానీ తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తామని ప్రతిపక్షాలు ప్రగల్భాలు పలుకుతున్నాయని, నిజంగా వారికి చేయాలనే చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే దేశంలో తాము పాలిస్తున్న రాష్ర్టాలలో ముందు అమలు చేసి చూపాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.
రూ.64కోట్ల 43లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నారాయణపేట రూరల్, జూన్ 6 : జిల్లాలో రూ.64కోట్ల 43లక్షల 19వేలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, జెడ్పీ చైర్పర్సన్ వనజ హాజరయ్యారు. నారాయణపేట నుంచి ఏక్లాస్పూర్ మీదుగా తెలంగాణ-సరిహద్దు వరకు రూ.5కోట్ల 98లక్షల 19వేలతో చేపట్టిన 5.5 కిలోమీటర్ల బీటీరోడ్డు, రూ.కోటీ 25లక్షలతో జిల్లా కేంద్రంలోని 100 పడకల మాడ్యులర్ చిల్డ్రన్ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అక్కడి ఉంచి బయల్దేరి నారాయణపేట మండలం అప్పక్పల్లి గ్రామశివారులో రూ.56కోట్ల వ్యయంతో నిర్మించనున్న 390 పడకల జిల్లా దవాఖాన, రూ.కోటితో చేపట్టనున్న టీ డయాగ్నొస్టిక్ హబ్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయాచంద్రకాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.