నవాబ్పేట, జూన్ 6 : రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలను పునరుద్ధరించడంతో భూగర్భజలాలు పెరిగాయన్నారు. త్వరలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్నారు. రిజర్వాయర్తో లక్షా 60వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
70ఏండ్లు పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు, రైతులకు ఏం చేశాయో చెప్పాలన్నారు. నల్లధనం బయటికి తీసి నిరుపేదలకు పంచుతానని చెప్పిన ప్రధాని మోదీ.. కార్పొరేట్లకు గులాంగిరి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్గా మెండె లక్ష్మయ్య, వైస్చైర్మన్గా చందర్నాయక్, మరో 12మంది డైరెక్టర్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ కోడ్గల్ యాదయ్య, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ ఎంపీపీ శీనయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, కృష్ణయ్య, ఎంపీటీసీలు రాధాకృష్ణ, గోపాల్, గోపీకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, నాయకులు నాగిరెడ్డి, రాంప్రసాద్, పురుషోత్తం, ప్రతాప్, అబ్దుల్లా, నవనీతరావు, కృష్ణగౌడ్, రఘు, భోజయ్యఆచారి, మార్కెట్ కార్యదర్శి శివశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.