జడ్చర్ల, జనవరి 29 : మండలంలోని గంగాపూర్లో లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం శకటోత్సవం(బండ్లు)ను నిర్వహించారు. వేడుకను తిలకించేందుకు రాష్ట్రంతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లల్లో భక్తులు తరలివచ్చి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మెట్లపైకి బండ్లను ఎక్కించి పూజలు చేశారు. గంట పాటు క్యూలైన్లో నిలబడి భక్తులు స్వామిని దర్శించుకొన్నారు. నైవేద్యం సిద్ధం చేసి స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయాయి. జాతరలో ఫ్లైవీల్, రంగులరాట్నం, జాయింట్ వీల్పై ఎక్కి భక్తులు, చిన్నారులు సందడిగా గడిపారు. సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
పూజలు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
లక్ష్మీ చెన్నకేశవస్వామిని ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు శాలువాలతో ఆయనను సత్కరించారు. అనంతరం జాతరలో కాలినడక వెళ్లి భక్తులను పలుకరించారు. పెద్దతేరుకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్దన్రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచ్ రవీందర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, రఘురాంగౌడ్, ముడా డైరెక్టర్ ఇమ్మూ, శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, గ్రామస్తులు గోపాల శ్రీనివాసులు ఉన్నారు.