నారాయణపేట/అచ్చంపేట/లింగాల, మే 23 ;సివిల్స్లో మనోళ్లు మెరిశారు. మంగళవారం వెలువడిన యూపీఎస్సీ-2022 ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించి శభాష్ అనిపించుకున్నది. అలాగే మరో గిరిజన ఆణిముత్యం సత్తా చాటింది. లింగాలకు చెందిన దీప్తి చౌహాన్ 630వ ర్యాంక్ సాధించింది. పలుమార్లు విఫలమైనా.. కలత చెందకుండా ధైర్యంతో ముందడుగు వేసి లక్ష్యాన్నిచేరారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళామణులు ప్రతిభ చాటడంతో పలువురు అభినందించారు. ఎమ్మెల్యేలు మొదలు.. కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్తువెత్తాయి.
ఉమాహారతి ప్రాథమిక విద్యాభ్యాసం..
వృత్తిరీత్యా తండ్రి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ విద్యాభ్యాసం చేస్తూ వచ్చింది. 6 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్లోని భారతి విద్యా భవన్లో, ఇంటర్ హైదరాబాద్లోని నారాయణ కాలేజ్లో చదివి, హైదరాబాద్లోనే బీటెక్ సివిల్ ఇంజినీర్ పూర్తి చేసింది. ప్లేస్మెంట్ వచ్చినప్పటికీ ఐఏఎస్ కావాలన్న తన తండ్రి ఆశయాన్ని, తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగం చేయకుండా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ వచ్చింది. ముందుగా ఢిల్లీలోని వాజీరాం ఇనిస్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నప్పటికి, అక్కడ ఉండి చదువుకోవాల్సిన అవసరం లేదని, ఇంటి దగ్గర ఉండి చదువుకోవచ్చునని భావించింది. తన తండ్రి మహబూబ్నగర్ ఏఎస్పీగా పనిచేస్తున్న కాలంలో అక్కడ, ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా పనిచేస్తుండడంతో ఏడాది కాలంగా పేటలోనే ఉంటూ ఐఏఎస్ కోసం ప్రిపేరవుతూ వచ్చింది. గతంలో నాలుగు సార్లు పరీక్ష రాసినా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడంతో ఎంపిక కాలేకపోయింది. ఐదో సారి పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో పరీక్ష రాయగా.. మంచి ర్యాంకు వచ్చింది. కాగా, తన సోదరుడు సాయి వికాస్ కూడా యూపీఎస్సీ 2022లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)లో ఆల్ ఇండియా స్థాయిలో 12వ ర్యాంక్ సాధించి, సోమవారమే ముంబాయిలో ఉద్యోగంలో చేరాడు. ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు ఫోన్లో, నేరుగా అభినందనలు తెలిపారు. డీజీపీ అంజనీకుమార్, ఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్, డీఐజీ రెమారాజేశ్వరి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఎస్పీలు, గత కలెక్టర్ హరిచందన, ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అడిషనల్ కలెక్టర్ మియాంక్ మిట్టల్, నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి ఫోన్లో అభినందనలు తెలిపారు.
తన లక్ష్యం సివిల్.. నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమైనా.. కలత చెందకుండా ధైర్యంతో ముందడుగు వేసి ఐదో సారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో ఎన్.ఉమాహారతి మెరుగైన ర్యాంక్ సాధించింది. నారాయణపేట ఎస్సీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి అందరిచే శభాష్ అనిపించుకున్నది. ప్రతి ఒటమినీ గెలుపునకు నాందిగా మార్చుకొని విజయం సాధించినట్లు యువ కలెక్టర్ చెప్పింది.
బయోడేటా..
పేరు : ఎన్.ఉమాహారతి.
తల్లి : ఎన్.శ్రీదేవి.
తండ్రి : ఎన్.వెంకటేశ్వర్లు (ఐపీఏస్), ప్రస్తుతం నారాయణపేట ఎస్పీ.
తమ్ముడు : ఎన్.సాయివికాస్ (ఐఈఎస్), ప్రస్తుతం ముంబాయిలో ఉద్యోగం.
సొంత ఊరు : హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా
విద్యాభ్యాసం : 6 నుంచి 10వ తరగతి వరకు భారతి విద్యాభవన్, హైదరాబాద్.
ఇంటర్మీడియట్ : నారాయణ కాలేజ్, హైదరాబాద్.
ఐఐటీ బీటెక్ సివిల్ ఇంజినీర్, హైదరాబాద్.
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
నమస్తే తెలంగాణ : మీకు స్ఫూర్తి ఎవరు ?
ఉమాహారతి : అమ్మ-నాన్న, తమ్ముడు. ముఖ్యంగా నాన్న. ప్రజలకు సేవ చేయడానికి ఐఏఎస్ మంచి ప్లాట్ఫాం అని నాన్న తరుచూ చెబుతుండేవారు. నాన్నకు ప్రేమతో… ఐఏఎస్ సాధించాలని లక్ష్యం పెట్టుకొని నేడు సాధించాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
గ్రాడ్యుయేట్ పూర్తయ్యాక, ఐఏఎస్ కోసం ఢిల్లీలోని వాజీరాం ఇనిస్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. కానీ అక్కడ ఉండి చదవాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దనే ఉండి ఇంటర్నెట్లో అవసరమైన పూర్తి మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకొని సబ్జెక్టు స్వతహాగా తయారు చేసుకున్నాను. అందుకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్లను నాన్న ఏర్పాటు చేశాడు.
ప్రతి రోజు ఎన్ని గంటలు చదివేవారు?
ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివేదాన్ని. నా ఆప్షనల్ సబ్జెక్టు ఆంత్రోపాలజీ.
నాలుగు సార్ల ఫెయిల్యూర్ను ఎలా జయించారు?
నాలుగు సార్లు ప్రయత్నించినా అనుకున్న లక్ష్యం నెరవేరకపోయే సరికి చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ అందరిలా దిగులు చెందలేదు. దాన్ని అధిగమించేందుకు యోగా, టెన్నిస్, రన్నింగ్ వంటి వాటితో పాటు ఇష్టమైన సినిమాలు, సీరియల్స్ను చూసేదాన్ని.
ఐఏఎస్గా మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు?
మహిళలు, విద్యా రంగాలు.
ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ వస్తుందని ముందే ఉహించారా?
తప్పకుండా ఈ సారి, ర్యాంక్ వస్తుందని నమ్మకం ఉండేది. కానీ, ఏకంగా ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ఈ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది.
మీకు సహకరించిన స్నేహితులు ఎవరు?
ఇది వరకు ఐఏఎస్కు ఎంపికైన నిఖిల్తో పాటు అంకిత, దీక్షితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. మేము ఆరుగురం ఫ్రెండ్స్. ఈ సారి పరీక్షలు రాస్తే అందులో నాతో పాటు పవన్ దత్త, జయసింహారెడ్డి, అక్షయ్దీపక్ ఐఏఎస్కు ఎంపికయ్యారు.
ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికిచ్చే సలహా, సూచనలు ఏంటి?
ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఒక లక్ష్యం నిర్దేశించుకొని దానికనుగుణంగా పనిచేయాలి. అందుకోసం ఏం అవసరమో ముందుగానే గుర్తించాలి. మనకు కావాల్సిన సబ్జెక్టును మనమే తయారు చేసుకోవాలి. అందుకోసం ఇంటర్నెట్ను ఉపయోగించాలి. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలను సేకరించి ప్రిపేర్ కావాలి. లక్షల మంది పరీక్షలు రాసే ఐఏఎస్ వంటి పరీక్షను ఒకసారికే సాధిస్తా అని అనుకోవద్దు. లాంగ్ టైం లక్ష్యం పెట్టుకొని పరీక్షకు సన్నద్ధం కావాలి. అంతేకానీ.. ఒకసారి సెలక్ట్ కాకపోతే దిగులు చెందొద్దు. ఒత్తిడిని పూర్తిగా జయించాలి. అందుకోసం చదువు మధ్యలో ఆటలకు ప్రాధాన్యతనివ్వాలి.