మహబూబ్నగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ 2కు వాయిదా వేసినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగే ఉపఎన్నిక కౌంటింగ్ను వాయిదా వేస్తూ, జూన్ 5వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎ న్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న ప్రకటించిన నేపథ్యంలో అదేరోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా ని యమావళి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక కౌంటింగ్ను జూన్ 2 వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల ప్రక్రియను నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అధికార కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. నేడు ఫలితాలు వెల్లడవుతాయని ధీమాతో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్ణయంతో డీలాపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ రోజే ఈ ఉపఎన్నిక కౌంటింగ్ కూడా జరుగుతుండడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసిన ఆయా పార్టీల నేతలు సైతం నిరాశకు గురయ్యారు. నేడే ఎన్నికల ఫలితాలు ఉం టాయని భావించి ఆయా రాజకీయ పార్టీలు ముం దస్తుగా మహబూబ్న్రగర్లో హోటళ్లను బుక్ చేసుకున్నారు. ఫలానా అభ్యర్థి గెలుస్తారని దానిపై బెట్టింగ్లు కూడా కట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున విందులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కౌంటింగ్ వాయిదా వేయడంతో హోటల్స్ బుక్ చేసుకున్న వారి జేబులు గుల్లయ్యా యి. కాగా అధికార పార్టీకి అనుకున్న స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేయకపోవడంతో కొంతమంది ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని సంప్రదించి కౌంటింగ్ వాయిదా వేయమని కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందని ఉద్దేశంతో కౌంటింగ్ వా యిదా వేసినట్లు చర్చ జరుగుతుంది.