అలంకార ప్రియుడిగా కురుమూర్తి రాయుడు భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో అతిపెద్ద ఘట్టం స్వర్ణాభరణాల ఊరేగింపు అంబరాన్నంటింది. అమరచింత నుంచి పట్టువస్ర్తాలను పద్మశాలీలు తీసుకురాగా.. ఆత్మకూరు ఎస్బీఐలో భద్రపర్చిన ఆభరణాలను బయటకు తీసి ఎమ్మెల్యే చిట్టెం దంపతులు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితోపాటు ప లువురు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం గాడి వంశస్తుడైన లక్ష్మీనారాయణ పెట్టెను తలపై పెట్టుకొని ఊరేగింపుగా కురుమతి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యాలైన కుర్వడోళ్లు, భాజా భజంత్రీలు, మేళతాళాల మోతలు ఓ వైపు.. మరోవైపు శివసత్తుల పూనకాలు, డీజే సౌండ్ హోరు, పటాకుల మోతతో ఆధ్యం తం అట్టహాసంగా సాగింది. భక్తులు దారి పొడవునా ఆభరణాలను తాకి తన్మయత్వం చెందారు. ఆలయంలోని కురుమూర్తి రాయుడిని అలంకరించ గా.. కాంచనగుహ పులకించింది. స్వామికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పూజలు చేశారు. ఆదివారం ప్రధాన ఘట్టమైన ఉ ద్దాలోత్సవం జరగనుండగా.. భక్తులు లక్షల్లో తరలిరానున్నారు.
దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట)/ఆత్మకూరు/అమరచింత, నవంబర్ 18 : పేదల తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకార మహోత్సవం శనివారం కన్నులపండుగగా సాగింది. ఆత్మకూరు మున్సిపల్ పాలకవర్గం నేతృత్వంలో స్వర్ణాభరణాల ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎస్బీఐలో భద్రపరిచిన స్వామివారి స్వర్ణాభరణాలను ఆచార వ్యవహారాలతో ఆనవాయితీ ప్రకారం ఊరేగించి కురుమతి కొండకు తరలించారు. ముందుగా బ్యాంకు మేనేజర్ అబ్బాస్అలీ, అసిస్టెంట్ మేనేజర్ స్వాతి, క్షేత్ర అధికారులు మదన్, లోక్శ్ సమక్షంలో దేవస్థానం కార్యనిర్వాహక అధికారి మదనేశ్వర్రెడ్డి, మండలి చైర్మన్ ప్రతాప్రెడ్డి స్థానిక విశ్వకర్మ ప్రతినిధులు బ్యాంకు లాకర్ నుంచి స్వర్ణాభరణాల పెట్టెను బయటకు తీశారు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దంపతులతో పాటు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీచైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి, వాకిటి శ్రీహరి, జలంధర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, వర్కటం జగన్నాథ్రెడ్డి వేదపండితుల నేతృత్వంలో స్వర్ణాభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గాడి వంశస్తులైన లక్ష్మీనారాయణ ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకొని ఊరేగింపును ప్రారంభించారు. సాంప్రదాయ వాయిద్యం, కుర్వడోళ్లు, బాజాభజంత్రీలు, మేళతాళాలు, డీజే సౌండ్స్ల హోరు, శివసత్తుల పూనకాలు, భారీ టపాసుల మోతతో పట్టణం దద్దరిల్లింది.
ఊరేగింపు పొడవునా వేలాదిగా భక్తులు స్వామివారి స్వర్ణాభరణాలను తాకి మొక్కేందుకు పోటీపడ్డారు. దారిపొడవునా పువ్వుల వర్షం కురిపిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. కేరళ కళాకారులతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాయిద్యం అందరినీ ఆకట్టుకున్నది. భక్తజనుల సౌకర్యం కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బ్యాంకు బయట డిజిటల్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. నాయకులు, యువకులు నృత్యాలు చేస్తూ హర్షం ప్రకటించారు. పట్టణ శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్టపై పరమేశ్వరుడి ఆలయానికి అభిముఖంగా ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించి స్వర్ణాభరణాలను పట్టణం నుంచి సాగనంపారు. ఊరేగింపు పొడవునా సీఐ కేఎస్ రత్నం, ఎస్సై శ్రీహరి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా, ప్రస్తుత ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న ప్రధాన అభ్యర్థులు చిట్టెం రామ్మోహన్రెడ్డి, వాకిటి శ్రీహరి, జలంధర్రెడ్డి, వర్కటం జగన్నాథ్రెడ్డి బ్యాంకు ఆవరణలో ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని అభివాదాలు తెలుపుకున్నారు. అలాగే స్వర్ణమ్మ, సీతమ్మ, రామన్న, శ్రీహరిలు ఒకరికొక్కరు పలుకరించుకున్నారు. ఎమ్మెల్యే ఆలతోపాటు ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రాజు, కార్యనిర్వహణాధికారి మదనేశ్వర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ శివరంజని, రవికుమార్యాదవ్,తాసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
అమరచింత, నవంబర్ 18 : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి శనివారం పట్టణంలోని పద్మశాలీ కుల బంధువులు భక్తమార్కేండయస్వామి ఆలయం నుంచి కురుమూర్తి స్వామి సన్నిధికి పట్టువస్ర్తాలను తరలించారు. ఏండ్లుగా ఉద్దాల ఉత్సవానికి ఇక్కడి పద్మశాలీ కులస్తులు, చేనేత కార్మికులు పట్టువస్ర్తాలను తయారు చేయడం అనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో చేనేత కార్మికులు దేవరకొండ లచ్చన్న, పారుపల్లి సోములు, పారుపల్లి వెంకటేశ్, మోహన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
అర్చకులు స్వామివారిని ప్రత్యేక అలంకరణతో వేదమంత్రోచ్ఛరణలతో గోవిందనామ భజనల మధ్య అత్యంత వైభవంగా అశ్వవాహనంలో ఊరేగింపు సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు తిలకించడానికి రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా 250 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.