మూసాపేట/దేవరకద్ర రూరల్, నవంబర్ 19: కురుమూర్తి గిరులు ఆదివారం గోవిందనామంతో మారుమోగాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఊరేగింపు నేత్రానందంగా సాగింది. ఆదివారం ఉదయం పల్లమర్రిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చాటకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి భక్తుల సందడితో మేళతాళాల మధ్య చాటను ఊరేగింపుగా చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం వరకు తీసుకొచ్చారు. అక్కడ ఆచారం ప్రకారం స్థానిక దళితలతోపాటు కలిసి ఎమ్మెల్యే ఆల, వివిధ పార్టీల నాయకులు పూజలు చేశారు. అక్కడి నుంచి ఉద్దాల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకను చూడడానికి వివిధ జిల్లాతోపాటు, ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. మహిళలు అత్యంత నిష్టలతో వంటలు వండి స్వామివారికి దాసంగాలు చేసి నైవేద్యం సమర్పించారు.
చిన్నచింతకుంట మండలంలోని చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల ఆలయంలో ఉద్దాలకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి జెడ్పీచైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, నెల్లి వంశస్తులైన మనోహర్రెడ్డితో కలిసి మొదటి పూజలు చేశారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల పెద్దలు ఉద్దాలకు ప్రత్యేక పూజులు చేశారు. అక్కడే భక్తుల దర్శనం కోసం ఉద్దాలను కొంత సమయం ఉంచి అక్కడి నుంచి వాగులో నుంచి తరలిస్తుండగా భక్తులు చాటకింద దూరి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్పై పెద్దవడ్డెమాన్, తిర్మలాపూర్ గ్రామాల మీదుగా కురుమూర్తి స్వామి ఆలయ సమీపంలోని మండపం వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఆల, జెడ్పీచైర్పర్సన్ భక్తులతోపాటు కలిసి పూజలు చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి స్వామివారి ఆలయం వద్దకు ట్రాక్టర్పై ఊరేగింపుగా తీసుకొచ్చి ఉద్దాల మైదానంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉద్దాల మండపం వద్దకు ఉద్దాలను తీసుకెళ్లి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పూజలు నిర్వహించారు. అక్కడికి తరలివచ్చిన భక్తులను ఎమ్మెల్యే ఆల పలకరిస్తూ సందడి చేశారు. ఉద్దాల ఊరేగింపులో మంగళవాయిధ్యాలు, భక్తుల భజనలు, కేరళ వాయిద్యం, సిగసత్తుల పూనకాలతో అంగరంగవైభవంగా స్వామి వారి ఉద్దాల ఊరేగింపు ముగింసింది. అనంతరం భక్తుల దర్శించుకున్నారు.
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద్దాలు ఊరేగింపునకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దాదాపు 2లక్షలకు పైగానే తరలివచ్చినట్లు పరిశీలకులు తెలిపారు. వివిధ సందర్భాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం వచ్చింది. ఆ సమయంలో పోలీసులు నిరోధించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం 7గంటల నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కురుమూర్తి రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ నుంచి గుట్టపై ఉన్న కాంచనగుహలోని స్వామివారి దర్శనం వరకు భారీగా క్యూలైన్ కట్టారు.
పాలమూరుతోపాటు వివిధ జిల్లాలకు చెందిన ఎన్నో వేల కుటుంబాలకు కురుమూర్తి స్వామి ఇంటి దేవుడుకావడంతో బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల రోజు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందుకే భక్తులు ఎవరి స్థాయిని బట్టి వారు బైక్లు, ఆటోలు, కార్లు, జీపులు, ఎద్దుల బండ్లు, బస్సులు, గూడ్స్ వాహనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి అందుబాటులో ఉన్న వాహనాలతో నలుమూలల నుంచి వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్దసంఖ్యలో భక్తులు కురుమూర్తి స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో స్వామివారి ఆలయ పరిసరాలు భక్తులు, వాహనాలతో నిండిపోయింది.
ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతరం పోలీసులు గట్టి బందోబస్తు చర్య లు తీసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఏర్పా ట్లు చేశారు. ఈవో మదనేశ్వర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరీరాము, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా జాతరలో ప్రత్యేకించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య రాకుండా చూశారు. ఎప్కటికప్పుడు పారిశుధ్యం పనులు చేపడుతున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.