నాగర్కర్నూల్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూచుకుళ్ల రాజేశ్రెడ్డి విజయం సాధించారు. నాగర్కర్నూల్లోని మార్కెట్యార్డులో ఆదివారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో రాజేశ్రెడ్డి సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డిపై 5,371 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రచారం ప్రారంభం నుంచి ఉన్న ఉత్కంఠ చివరి రౌండ్ ఫలితాల వరకు కొనసాగింది. జనసేన అభ్యర్థి వంగా లక్ష్మణ్గౌడ్, బీఎస్పీ అభ్యర్థి కుమార్ తమ ఉనికిని చాటుకోలేకపోయారు. తిమ్మాజిపేటలో మర్రికి ఆధిక్యం రాగా బిజినేపల్లిలో కాంగ్రెస్కు వచ్చింది. నాగర్కర్నూల్ టౌన్, రూరల్లోనూ రాజేశ్రెడ్డికి మంచి ఆధిక్యం రాగా తెలకపల్లిలో 6వేల మెజార్టీ రావడంతో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైంది. చివరికి 5,371ఓట్లతో రాజేశ్రెడ్డి గెలుపొందినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్కుమార్ ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. మాజీ మంత్రి, కొల్లాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన జూపల్లి కృష్ణారావును కలిసిన రాజేశ్రెడ్డి ఒకరినొకరు అభినందించుకున్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా వేలాదిమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడళ్లలో పటాకులు కాల్చుతూ, డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈక్రమంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలుపు ప్రజల విజయమని రాజేశ్రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతోపాటు మ్యానిఫెస్టోను వందశాతం అమలు చేసి మంచి పాలన అందిస్తామన్నారు. తన తండ్రి కూచకుళ్ల దామోదర్రెడ్డి అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేస్తానన్నారు. ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటానన్నారు. వైద్యుడిగా సేవలందించిన తాను ప్రజా సేవకుడిగా పని చేస్తానన్నారు.