గద్వాల టౌన్, జనవరి 13 : సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైనది పతంగులు ఎగురవేయడం. చిన్నా, పెద్ద తేడా లేకుండా గ్రామాలు, పట్టణాల్లో ఇంటి మిద్దెలపైకి ఎక్కి పతంగులను ఎగురవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఒకరికొకరు పోటీ పడుతూ పతంగులను ఎగురవేస్తుంటారు. ఈ పతంగులకు 600ఏండ్ల చరిత్ర ఉందంటే ఎవరైనా నమ్ముతారా. క్రీస్తు పూర్వం 100 ఏండ్ల నుంచి 600 ఏండ్ల వరకు చైనా జనరల్స్ వారి యుద్ధ సాంకేతిక సమాచారాల కోసం గాలి పటాలను వినియోగించే వారని చరిత్ర చెబుతున్నది. అలాగే భారతదేశంలో కూడా ఎందరో రాజులు ఇదే విధానాన్ని అవలంబించారు. గాలి పటాల ద్వారా శత్రువులు ఎంత దూరంలోఉన్నారో తెలుసుకోవడానికి సులభంగా ఉండేదని, ఆ దిశగా యుద్ధ్దాలు చేయడానికి సన్నద్ధమయ్యేవారని చరిత్ర చెబుతున్నది. అలాగే విమానాన్ని కనిపెట్టడంలో కూడా గాలి పటం పాత్ర ఉందని తెలుస్తుంది. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చెట్టుకు, తీగలకు గాలిపటాలు చిక్కుకున్నప్పుడు వదిలిపెట్టాలి. పిట్టగోడలు, బిల్డింగ్లపై ఎక్క రాదు. మైదాన ప్రాంతాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి. మార్కెట్లో గాలిపటాలను రూ.10 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు.