కంటి పరీక్షలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రజలకు కంటి సమస్యలు దూరం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15న శ్రీకారం చుట్టింది.. మరో విడుత నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 2023 జనవరి 18నుంచి ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. ఆప్తాలమిస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తారు. సాధారణ దృష్టి లోపాలుంటే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసెస్ అందజేయనున్నారు. అవసరమైతే ప్రత్యేక అద్దాలు నెలరోజుల్లో వైద్య సిబ్బంది ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 38,68,245 మందికి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో పరీక్షలకు అధికారులు సన్నద్ధమయ్యారు.
వనపర్తి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానమని అన్నారు పెద్దలు..’ అయితే మారుతున్న జీవనశైలి. ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పుల వల్ల కంటి సమస్య అందరికీ సర్వసాధారణమైంది. ఇలాగే కొనసాగితే ప్రమాదమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేండ్ల కిందట కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేయడం, సమస్య తీవ్రంగా ఉన్నవారికి శస్త్రచికిత్స అందించి కంటి సమస్యలను దూరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభించింది. అయితే జనవరిలో రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ వనపర్తి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. దాదాపు మూడున్నర లక్షల మందికి కంటి పరీక్షలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స ఖర్చును భరించలేని చాలామంది పేదలతోపాటు ఉచితంగా అందించే కండ్లద్దాలు, శస్త్రచికిత్స కోసం ఇతరులు కూడా వచ్చే అవకాశముండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతమంది సిబ్బంది అవసరం.. వైద్యుల అవసరమెంత అనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
కంటి సమస్య ఉన్నవారికి చికిత్స అందజేసి అంధకారం నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా వయోబేధం లేకుండా అన్నివర్గాల వారికి చికిత్స అందజేయనున్నది. పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు కంటి వెలుగులో చికిత్స అందజేయనున్నారు. ప్రపంచం డిజిటల్గా మారిన నేపథ్యంలో బాల్యంలోనే కంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వయోభారం వల్ల వయస్సు పెరిగే కొద్దీ కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల పిల్లల డాటాతోపాటు గతంలో చికిత్స అందుకున్న వారి వివరాలు, జిల్లాలో ఉన్న వృద్ధుల వివరాలను జిల్లా వైద్యారోగ్యశాఖ సేకరించింది. జిల్లా జనాభా విషయానికి వస్తే 5,80,651 మంది ఉండగా, కంటి సమస్యతో బాధపడుతున్న వారు దాదాపు 40శాతం ఉంటారని అంచనాకు వచ్చారు. మొదటి విడుతలో 3,17,173 మంది కంటి పరీక్ష చేయించుకోగా, 78,313 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 4,054 మందికి అద్దాలను పంపిణీ చేయాల్సి ఉంది. కంటి శస్త్రచికిత్స విషయానికొస్తే 9వేలమందికి చేయగా, మరో 2,642 మందికి చేయాల్సి ఉంది.
రెండోవిడుత కోసం జిల్లా వైద్యాఆరోగ్యశాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈసారి పరీక్ష చేసుకునేందుకు దాదాపు జనాభాలో 60శాతం అంటే దాదాపు 3,48,390మంది సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో 40శాతం మందికి కంటి సమస్యలు ఉన్నట్లు తెలిసింది. కంటి పరీక్షల నిర్వహణకు దాదాపు 18 బృందాలు అవసరమవుతాయని, అంతేకాకుండా మరో రెండు అత్యవసర బృందాలు ఉండాలని నిర్ణయించారు. వీటి కోసం 20మంది కంటివైద్య నిపుణులు, 20 టెస్టింగ్ మిషన్లు కావాల్సి ఉందని పేర్కొంటున్నారు. అయితే జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు వైద్యనిపుణులు, రెండు మిషన్లు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అవసరమైన నిపుణులను, మిషన్లు తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే వైద్యాధికారులతో పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశాం. ఏర్పాట్లపై సమీక్ష చేసుకుని ఒక స్పష్టత కు వచ్చాం. ఎంతమంది పరీక్షల కోసం వచ్చినా సేవలందించేందుకు జిల్లా వైద్యశాఖ సిద్ధంగా ఉంది. మూడున్నర కోట్ల మంది టెస్టుల కోసం వచ్చే అవకాశం ఉందని అంచనాకు వచ్చాం. అందరికీ కంటి పరీక్షలు చేసి కేవలం సమస్య ఉన్న వారిని గుర్తించి కండ్లద్దాలు లేదా శస్త్రచికిత్స చేసేలా కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రక్రియ కొనసాగుతుంది.
– రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి