గద్వాల, ఆగస్టు 19 : జూరాలకు సోమవారం భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,45,000 లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 38 గేట్ల ద్వారా దిగువకు 2,47,380 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 24,383 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు మొత్తం ఇన్ఫ్లో 2,45,000 క్యూసెక్కులు ఉండగా మొత్తం అవుట్ ఫ్లో 2,72,106 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 కాగా ప్రస్తుతం 6.987 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
అయిజ, ఆగస్టు 19 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర నదుల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో 27 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 1,07,536 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి వి డుదల చేస్తున్నారు. మంగళవారం టీబీ డ్యాంకు ఇన్ఫ్లో 1,13,567 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,22,506 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 74.56 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1624.41 అడుగులు ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 1,20, 000 క్యూసెక్కులు ఉండగా, ప్రధాన కాల్వకు 493 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్కు 1,19,507 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 13.5 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలం, ఆగస్టు 19 : ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ శ్రీశైలం చేరుకుంటున్న కృష్ణమ్మ పాల పొంగుల అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మంగళవారం జలాశయానికి ఇన్ఫ్లో 3,90,135 క్యూసెక్కుల నీరు రాగా ప్రాజెక్టు నుంచి పది గేట్లు 14 అడుగుల మేర ఎత్తి 3,44,750 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 65,436 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హంద్రినివా నుంచి 2,818 క్యూసెక్కులు మొత్తంగా 4,43,004 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.90 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.3623 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి మరింత పెరిగింది.