అంతటా అంబేద్కర్ విగ్రహావిష్కరణపైనే చర్చ.. హైదరాబాద్లో 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా నుంచి బహుజనులు, నాయకులు తరలివెళ్లారు. దీంతో పల్లె, పట్నం ఎక్కడ చూసినా రచ్చకట్టల వద్ద.. నలుగురు గుమిగూడినా విగ్రహ ఏర్పాటుపైనే చర్చ. ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్కు ఆత్మీయ గౌరవం ఇచ్చిందని అందరూ చర్చించుకుంటున్నారు. వారి పిల్లలకు సైతం చైతన్య మూర్తి విగ్రహాన్ని చూపి వారిలో నిత్య స్ఫూర్తి నింపుతామని చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుతో దళితులకు ఆర్థిక స్వావలంబన ఇవ్వగా. మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
– మహబూబ్నగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : కొందరు వ్యక్తులు.. దళితులను ఉద్దరిస్తున్నట్లు నటిస్తారు. ఏదో చేస్తామని చెప్పి ఓట్లు దండుకుంటారు. అణగారిన వర్గాలను ఇంకా అడుగుకు నెట్టేయాలని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతిని చేతల్లో చూపిస్తున్నది. అందుకు రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్ష్యంగా నిలిచింది. రాజధాని నడిబొడ్డున ప్రపంచంలో ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. దళితజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్రలోకెక్కాడని దళిత, బహుజన సంఘాలు అంటున్నాయి. ఆ మహనీయుని జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడంపై దళిత సంఘాలు సంబురాలు చేసుకుంటున్నాయి.
ఈ విగ్రహాన్ని చాలామంది సోషల్మీడియాలో పోస్టులు చేసి హల్చల్ చేశారు. యూట్యూబ్లో విగ్రహం గురించి విశేషాలపై వచ్చిన వీడియోలు సోషల్మీడియాలో వారం రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా విగ్రహం గురించే చర్చ జరుగుతున్నది. విగ్రహం ఎలా తయారు చేశారు? ఎన్ని రోజులు పట్టింది.. పార్లమెంట్ నమూనా వేదికపై విగ్రహం ఏర్పాటు చేసిన విశేషాలు ట్రెండింగ్ అయ్యాయి. మారుమూల పల్లెల్లో సైతం రచ్చబండల వద్ద ఇదే చర్చ. తెలంగాణ ప్రభుత్వం సమున్నత న్యాయం కల్పించిందని అభినందిస్తున్నారు. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్అంబేద్కర్ను ఆహ్వానించడంతో నిజమైన గౌరవం దక్కిందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిజమైన దళిత బాంధవుడని అంటున్నారు. టీవీలు, సోషల్మీడియాల్లో చాలామంది లైవ్ చూశారు. కాగా విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన బస్సులన్నీ కిటకిటలాడాయి.
జీవితాలను మార్చిన దళితబంధు..
స్వరాష్ట్రంలో దళితులు, అణగారిన వర్గాలకు ఎన్ని ప్రణాళికా సంఘాలు పెట్టినా, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కార్పొరేషన్లు పెట్టినా దళితుల జీవితాల్లో మార్పురాలేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల జీవితాలను మార్చివేసింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల కుటుంబాలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయి. తమ కాళ్లమీద తాము నిలబడి పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పథకం రాకముందే దుకాణాల్లో గుమాస్తాగా, కారు డ్రైవర్లుగా, బట్టల షాపుల్లో వర్కర్లుగా పనిచేశారు. నేడు అదే దుకాణాలు, కార్లకు ఓనర్లయ్యారు. ఇ న్నాళ్లు ఓటుబ్యాంకుగా మారిన దళితుల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపిందని, సీఎం కేసీఆర్కు తాము రు ణపడి ఉంటామంటున్నారు.
అభినందిస్తున్న ప్రతినిధులు..
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది హాజరయ్యారు. ఈ మేరకు దళిత ప్రతినిధులను అధికారులు ముందే ఎంపిక చేశారు. ఆయా నియోజకవర్గాల నుంచి బయలుదేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి బస్సుకు ఇద్దరు అధికారులను కేటాయించారు. ప్రతినిధులను తీసుకువెళ్లడం.. తిరిగి వారిని గమ్యస్థానాలకు చేర్చడం వీరిదే బాధ్యత. తాగునీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం తదితర ఏర్పాట్లన్నీ అధికారులే చేశారు. దీంతో ఎంపిక చేసిన ప్రతినిధులకు ముందుగానే ఐడీ కారులు అందజేశారు. ఇదో అద్భుత ఘట్టమని ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
చారిత్రాత్మకమైన నిర్ణయం
హైదరాబాద్లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం యావత్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన జయంతిన విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణ యం. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యయ ప్రయాసాలకోర్చి దేశంలో ఎక్కడాలేని విధంగా కాంస్య విగ్రహాన్ని నిర్మించడం ఆయన ఉదారగుణానికి నిదర్శనం. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి చేరవేసి చైతన్యపరచగలిగితే సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు.
– నెహ్రూప్రసాద్, ఉపాధ్యాయుడు, కల్వకుర్తి
దళితబంధుతో ఆర్థిక భరోసా..
దళితుల మనోభావాలను గౌరవించడం గొప్ప విషయం. నవ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయం. ఒక వ్యక్తికి మనోధైర్యం ఉంటే ఏ పనైనా చేసుకొని బతకగలడు. ఏ అంశంలోనైనా జయించగలడు. ఆ మనోధైర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. అన్ని వర్గాల వారికి సమానంగా నిలుస్తున్నారు.
– కోళ్ల వెంకటేశ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు, వనపర్తి
తెలంగాణకు గర్వకారణం..
హైదరాబాద్లో రూ.146 కోట్లతో ప్రపంచంలో అత్యం త ఎత్తయిన 125 అడుగుల అంబ్కేదర్ విగ్రహం ఏర్పా టు చేయడం తెలంగాణకు గర్వకారణం. ఈ ఏడాది అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవం గా నిర్వహించడం సంతోషం గా ఉన్నది. ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం రావడానికి రాజధానిలోని విగ్రహం ఏర్పాటే ముఖ్య కారణం. గత పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు. దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశా రు. ఏనాడూ మా సంక్షేమం గురించి ఆలోచించలేదు. ఎన్నికల సమయంలో మాత్రం తప్పకుండా ఆదుకుంటామని చెప్పేవారు. తరువాత మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం కేసీఆర్ హయాంలో అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. దళితబంధు పథకం ద్వారా సామాజిక, ఆ ర్థిక భరోసా కలుగుతున్నది. ఈ విగ్రహం దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక.
– రామేశ్వరమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్, గద్వాల
హైదరాబాద్లో 125 అడుగుల అంబ్కేదర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటా లకు ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలు, పూలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్కుమార్, కృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జయన్న, మహిళా అధ్యక్షురాలు జయమ్మ, నర్సింహులు, వెంకటేశ్, యాదగిరి, నర్సింహ, రఘు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
– మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 15
సీఎం సంకల్పం గొప్పది..
అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటుచేయడం ఆనందంగా ఉన్నది. సచివాలయం వద్ద బీఆర్ విగ్రహం ఉంటే.. ఆయన ఆశయాలు నిరంతరం గుర్తుకువస్తాయని ఆలోచన చేసి న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది. ముఖ్యమంత్రి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణం గా పనిచేస్తున్నాడు. ఆయా రాష్ర్టాల్లో మొక్కుబడిగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో పండుగ వాతావరణం ఏర్పడింది. బాబాసాహెబ్ మనుమడిని ఆహ్వానించడం
గర్వకారణం. – బ్యాగరి రాములు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, కోస్గి