అలంపూర్, జనవరి 26 : ‘అమ్మలగన్న అమ్మ.. జగజ్జననీ పాహిమాం.. జోగుళాంబ మాతాకీ జై..’ అంటూ భక్తులు దైవచింతనలో డోలలాడారు. రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన జోగుళాంబ ఆలయంలో ఏటా వసంత పంచమి సందర్భంగా అమ్మవారు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగితేలారు. కొంతమంది భక్తులు పూనకంతో ఊగిపోయారు. భక్తులతో ఆలయప్రాంగణమంతా కిక్కిరిసింది. కుటుంబసభ్యులను చల్లగా చూడాలని వేడుకున్నారు. ప్రతిఒక్కరి కంఠం అమ్మ నామాన్ని స్మరించాయి. ప్రతి అడుగూ అమ్మ దర్శనానికై ముందుకు సాగాయి. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో హోమాలు చేశారు.
ఐదు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్యాయి. సాయంత్రం జోగుళాంబ సహిత బాలబ్రహ్మేశ్వర స్వామి వారి శాంతి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ధ్వజ అవరోహణం చేసి మహా మంగళహారతి సమర్పించారు. అమ్మవారి కుంకుమార్చన మండపంలో అర్చకులు సహస్ర ఘటాభిషేకాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిలో సుగంధ ద్రవ్యాలను, నవ ఔషధులను కలిపారు. అలా కలిపిన నీటితోపాటు ఇంటి నుంచి తెచ్చిన జలాలు, పంచామృతాలతో భక్తులు అమ్మవారి దివ్యరూపాన్ని అభిషేకించారు. ఆలయానికి ఈశాన్య భాగంలో నిర్మించిన యాగశాల మండపంలో ఆవాహిత దేవతా హోమాలకు ఈవో పురేందర్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి సభ్యులు, భక్తులు, దాతలు, అర్చకులు పూర్ణాహుతిని సమర్పించారు. చండీహోమం తర్వాత అమ్మవారికి ప్రీతిపాత్రమైన సుగంధ ద్రవ్యాలు, పట్టుచీర, నవరత్నాలు, గంధపు చెక్కలను పూర్ణాహుతిలో వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగవరం, కాశాపురం, ఇమాంపురం, లింగనవాయి, బుక్కాపురం, సుల్తానాపురం, బైరంపల్లి తదితర గ్రామాల నుంచే కాకుండా పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి కలశాలతో భక్తులు ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. కాగా, ఆలయంలో రెండు వరుసల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో భక్తులకు ఊరట కలిగింది. ప్రముఖులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు కల్పించారు.
ఘనంగా గ్రామోత్సవం..
అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్నేండ్లుగా జోగుళాంబ సేవా సమితి సభ్యుడు బండి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండారి వెంకన్న బాబు తమ సొంత ఖర్చులతో గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన 30 మంది కళాకారులతో గ్రామోత్సవాన్ని నిర్వహించి ఉత్సవాలకు వన్నె తీసుకొచ్చారు. కళాకారుల వేశధారణలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులకు జోగుళాంబ సేవా సమితి, ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
ఆలయంలో ప్రముఖులు..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం, జెడ్పీ చైర్ పర్సన్ సరితాతిరుపతయ్య దంపతులు, గద్వాల జిల్లా సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ఘంటా కవిత, జూనియర్ కోర్టు జడ్జి కనకదుర్గ, అలంపూర్ జూనియర్ సివిల్కోర్టు జడ్జి కమలాపురం కవిత, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమవెంకటేశ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్పీ రంజన్ రతన్కుమార్, అలంపూర్ సీఐ సూర్యానాయక్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.