గద్వాల రూరల్, మార్చి 5 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చా రు. గర్భగుడిలో అమ్మవారిని చూసి భక్తజనం పరవశించి జములమ్మ తల్లీ కరుణించమ్మా అంటూ పూనకాలు, కేరింతలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్ కావడంతో నడిగడ్డ ప్రాంతంలో ప్రతి ఇంట్లో శుభకార్యానికి ముందు జములమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ.
దీంతో దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్పర్సన్ గాయత్రి, ఈవో పురేందర్కుమార్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గద్వాల రూరల్ ఎస్సై పర్వతాలు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జానకీరాములు, ఓం ప్రకాశ్ కాంబ్లే, అభిలాష్, శంకర్, రాము, ఆలయ సిబ్బంది మురళీధర్రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాశ్, రాజలింగం పాల్గొన్నారు.