అలంపూర్, జనవరి 21: అలంపూర్లోని ఐదో శక్తిపీఠమైన అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళైంది. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుద్దీపకాంతుల్లో ఆలయం మిరిమిట్లుగొల్పుతున్నది. ఆదివారం నుంచి 26వ తేదీవరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు ఉదయం 8గంటల నుంచి క్షేత్రంలోని యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ఆరంభంకానున్నాయి.
పుణ్యహవచనం, మహా గణపతిపూజ, రుత్విక్ వరణం, మహా కలశ స్థాపన, ధ్వజారోహణం, 23నుంచి 26వ తేదీ వరకు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అర్చనలు, చండీహోమం, పవమాన సూక్త పారాయణం, హోమా లు, ఆవాహిత దేవతా హోమాలు, మండపారాధన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలతో వేడుకలు జరగనున్నాయి. చివరిరోజు వసంత పంచమిని పురస్కరించుకొని జోగుళాంబ దేవి నిజరూప దర్శనభాగ్యం కల్పించనున్నారు. జోగుళాంబ సేవాసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పురవీధుల మీదుగా ఆలయ వరకు నిర్వహించే గ్రామ దేవతల అలంకరణ, ప్రభోత్సవం, గ్రామోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది.
ఉత్సవాల చివరి రోజు సాయంత్రం 4 గంటలకు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసిన అమ్మ వారి వాహనం (సింహం) జెండాను సంధ్యావేళ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో భాగంగా తొలగిస్తారు. అనంతరం మంగళహారతితో ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాది తరలిరానున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ పాలక మండలి సభ్యులు, చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్కుమార్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖుల వద్దకు వెళ్లి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు.